Excise Police: నకిలీ మద్యం కేసులో మరొకరు అరెస్టు
ABN , Publish Date - Dec 12 , 2025 | 06:44 AM
నకిలీ మద్యం సీసాలకు మూతలు సరఫరా చేసిన మరో నిందితుడిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు.
మూతలు సరఫరా చేసిన వ్యక్తి జైలుకు
విజయవాడ, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం సీసాలకు మూతలు సరఫరా చేసిన మరో నిందితుడిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. దారబోయిన ప్రసాద్ (ఏ-23)ను హైదరాబాద్లో అదుపులోకి తీసుకొని విజయవాడ ఆరో అదనపు జుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి జి.లెనిన్బాబు ఎదుట హాజరుపరిచారు. నిందితుడికి ఈ నెల 24 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం అతడిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఇబ్రహీంపట్నం, ములకలచెరువులోని నకిలీ మద్యం తయారీ కేంద్రాలకు ప్రసాద్ హైదరాబాద్ నుంచి వివిధ నకిలీ బ్రాండ్ల పేర్లను ముద్రించి మూతలను సరఫరా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు, అద్దేపల్లి జగన్మోహనరావు మద్యం నింపడానికి అవసరమైన సీసాలను గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన డి. శ్రీనివాసరెడ్డి నుంచి కొనుగోలు చేశారు. విజయవాడ వన్టౌన్కు చెందిన ముతా మనోజ్ నుంచి సుమారు8 లక్షల సీసాలు, మూతలను కొనుగోలు చేశారు. వీరిలో శ్రీనివాసరెడ్డి రిమాండ్ ఖైదీగా ఉండగా, ముతా మనోజ్ ఉపశమనం కోసం హైకోర్టును ఆశ్రయించారు.