Liquor Scam Exposed: మరో 5 కోట్ల గుట్టు రట్టు
ABN , Publish Date - Aug 01 , 2025 | 02:43 AM
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో రోజుకో గుట్టు బయటకు వస్తోంది. అదాన్ డిస్టిలరీస్లో అకౌంటెంట్గా పనిచేసిన శ్రీకాంత్ ఐదు కోట్ల రూపాయల రహస్య లావాదేవీల...
రాజ్ కసిరెడ్డి డైరెక్షన్లో మద్యం ముడుపుల పంపిణీ
ఇచ్చింది పంకజ్.. చేరింది సైమన్, వేణుకు.. 25, 30 లక్షల చొప్పున పలుమార్లు అందజేత.. సిట్కు వరుణ్ వెల్లడి
అదాన్ అకౌంటెంట్ శ్రీకాంత్ విచారణ
డొల్ల కంపెనీల గుట్టు తేల్చేందుకు ముంబైకి సిట్
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్కూ బృందాలు
అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో రోజుకో గుట్టు బయటకు వస్తోంది. అదాన్ డిస్టిలరీ్సలో అకౌంటెంట్గా పనిచేసిన శ్రీకాంత్ ఐదు కోట్ల రూపాయల రహస్య లావాదేవీల సమాచారాన్ని తాజాగా సిట్ అధికారులకు వివరించాడు. దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్టయిన ఏ-40 వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారం ఆధారంగా శ్రీకాంత్ను గురువారం విజయవాడలో సిట్ ప్రశ్నించింది. హైదరాబాద్ శివారులో దాచిన రూ.11 కోట్ల నగదు డెన్ గురించి వరుణ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. రూ.5కోట్ల మరో లావాదేవీ గురించి ఇప్పుడు శ్రీకాంత్ వెల్లడించాడు. హైదరాబాద్లో ముడుపులు చేతులు మారిన విషయం గురించి అధికారులకు వివరించాడు. మూడున్నర వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి(ఏ-1)కి అదాన్ డిస్టిలరీస్ బినామీ సంస్థ. మొదట తోడల్లుడు ముప్పిడి అవినాశ్ రెడ్డి, ఆ తర్వాత కాశీచయనుల శ్రీనివాస్ డైరెక్టర్లుగా అదాన్ డిస్టిలరీస్ను నడిపించాడు. అదాన్లో అకౌంటెంట్గా శ్రీకాంత్, ఆపరేషన్ మేనేజర్గా వరుణ్ పురుషోత్తం పని చేశారు. లీలా డిస్టిలరీస్ ప్రారంభించిన వెంటనే దాని పూర్తిస్థాయి బాధ్యతలు వరుణ్ పురుషోత్తంకు అప్పగించారు. ఈ రెండు డిస్టిలరీస్ నుంచి క్రమం తప్పకుండా ముడుపులు చెల్లించేందుకు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలో లీలా తరఫున ముడుపులు ఇచ్చే బాధ్యత పంకజ్కు అప్పగించారు. శ్రీకాంత్ తరచూ వరుణ్కు ఫోన్ చేసి ‘నువ్వు హైదరాబాద్లోని వెంగళరావు పార్క్ వద్దకు, అయ్యప్ప సొసైటీలోని కార్ల షోరూం వద్దకు వెళ్లు.. అక్కడికి పంకజ్ వచ్చి డబ్బులిస్తాడు. తీసుకున్న వెంటనే కాశీచయనుల శ్రీనివా్సకు ఫోన్ చెయ్యి.. ఆయన చెప్పిన వారికి అప్పగించు’ అని చెప్పేవాడు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిసారి పాతిక, ముప్పై లక్షల చొప్పున పలుమార్లు వరుణ్ డబ్బులు తీసుకుని శ్రీనివాస్ చెప్పిన వారికి అందజేసేవాడు. ఎక్కువ సార్లు సైమన్ ప్రసన్(ఏ-41), వేణు(నిందితుడు కాదు)కు అందజేసినట్లు సిట్ విచారణలో వరుణ్ వెల్లడించాడు. ఈ వాంగ్మూలం ఆధారంగా శ్రీకాంత్ను పిలిపించి సిట్ అధికారులు విచారించారు. ‘రాజ్ కసిరెడ్డి చెప్పినట్లు అదాన్ డైరెక్టర్ కాశీచయనుల శ్రీనివాస్ చేసేవాడు. శ్రీనివాస్ ఆదేశాల మేరకు డబ్బులిచ్చే వ్యక్తి పేరు వరుణ్కు చెప్పి, తీసుకున్న తర్వాత శ్రీనివా్సకు ఫోన్ చేయమని చెప్పేవాడిని. ఆ డబ్బులు వైసీపీ పెద్దలకు చేరుతున్నట్లు అర్థమైంది’ అని శ్రీకాంత్ చెప్పినట్లు సమాచారం. దుబాయ్లో ఉంటున్న సైమన్ ప్రసన్, ఇప్పటి వరకూ ఈ కేసులో పేరు బయటపడని వేణును త్వరలో విచారించి, ఈ బాగోతాన్ని పూర్తిగా వెలికి తీసేందుకు సిట్ అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
విచారణకు ఐదు సిట్ బృందాలు
లిక్కర్ స్కామ్ను టెక్నాలజీ సాయంతో వెలికితీస్తున్న సిట్ అధికారులు డొల్ల కంపెనీల గుట్టు తేల్చేందుకు ముంబైకి వెళ్లారు. మద్యం ముడుపులను ‘వైట్’గా మార్చుకోవడానికి ముంబైలో పలు డొల్ల సంస్థలు పుట్టించిన మద్యం ముఠా హవాలాకు పాల్పడిన వైనాన్ని వెలికితీసే ప్రయత్నంలో భాగంగా రెండు ప్రత్యేక బృందాలు ముంబైకి చేరుకున్నాయి. బంగారం బిల్లులు, దుస్తుల బిల్లులు, జీఎస్టీ వ్యవహారాలు, హవాలా గుట్టు తేల్చబోతున్నట్లు తెలిసింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలకూ మరో మూడు సిట్ బృందాలు వెళ్లాయి.