అన్నదాత సుఖీభవ పథకం
ABN , Publish Date - May 28 , 2025 | 11:31 PM
రైతుల పాలిట వరంగా అన్నదాత సుఖీభవ పథకం మారనుంది. జూన నెలలో రైతుల కోసం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చే యయనుంది.
జూనలో అమలుకు సిద్ధం
మహానాడు వేదికపై సీఎం చంద్రబాబు ప్రకటన
ఉమ్మడి జిల్లాలో 4.50లక్షల మంది రైతులకు లబ్ధి
హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
కర్నూలు అగ్రికల్చర్, మే 27 (ఆంధ్రజ్యోతి): రైతుల పాలిట వరంగా అన్నదాత సుఖీభవ పథకం మారనుంది. జూన నెలలో రైతుల కోసం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చే యయనుంది. కడపలో జరుగుతున్న మహానాడు వేదికపై సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు ఈ వరాన్ని ఇచ్చారు. జూనలోనే అమలు చేస్తామని ప్రకటించారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని 4.50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు అవగాహన కల్పించి..
‘అన్నదాత సుఖీభవ’ కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు సాయం అందిస్తున్నామని ఎన్నికల వేళ చంద్రబాబు హామీ ఇచ్చారు. దీన్ని జూనలో అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు అవగాహన కల్పించి ఈ పథకం లబ్ధికి రైతు సేవా కేంద్రాల్లో అవసరమైౖన వివరాలన్నీ సమర్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా గత పది రోజులుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అర్హత ఉన్న 4.50లక్షల మంది రైతుల్లో దాదాపు 90 శాతం మంది రైతులు తమ ధృవపత్రాలను రైతు సేవా కేంద్రాల్లో అందించారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు రైతులు తమ వివరాలను రైతు సేవాకేంద్రాల్లో నమోదు చేసుకుంటున్నారు. ప్రభుత్వం గతంలో ఈ నెల 20 వరకే రైతు సేవా కేంద్రాల్లో తమ పత్రాలను అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ శాఖ యంత్రాంగంతో పాటు రైతుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 25 వరకు ప్రభుత్వం గడువును పెంచింది.
రీసర్వే ఇబ్బందులు..
అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు కొంత మంది రైతులకు రీసర్వే ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. ఈ సర్వేలో భాగంగా ఏళ్ల తరబడి ఉన్న సర్వేనెంబర్ల స్థానంలో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్పీఎం) తీసుకువచ్చారు. వైసీపీ పుణ్యమా అని రీసర్వే సమయంలో నలుగురు ఐదుగురు రైతులతో కలిపి ఒకే ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నెంబరును కేటాయించారు. ఆ మేరకు హక్కు పత్రాలు కూడా అందించారు. అయితే ల్యాండ్ పార్సిల్ మ్యాప్లో ఏ రైతు పేరు నమోదు చేస్తే.. మిగలిన రైతుల భూమి విస్తీర్ణం కూడా ఆ రైతు పేరు మీదనే నమోదైంది. ఇలాంటి ఉమ్మడి ఎల్పీఎం నెంబర్ అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ది పొందేందుకు అడ్డంకిగా మారిందని వ్యవసాయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. ల్యాండ్ పార్సిల్ మ్యాపింగ్ కారణంగా ఒక రైతు పేరును మాత్రమే రికార్డుల్లో ఉండటంతో మిగతా వారికి ఈ పథకం అందించేందుకు కష్టమవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు ఆధార్ నెంబర్లు సరిగ్గా లేకపోవడం, మొబైల్ నెంబరు ఆదార్ లింకింగ్ వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ అడ్డంకులను వెంటనే పరిష్కరించి అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు చర్యలు చేపట్టాలని రైతులు మొర పెట్టుకుంటున్నారు.