Weather Alert: మండుతున్న రాష్ట్రం
ABN , Publish Date - Jul 13 , 2025 | 05:39 AM
మేఘాల జాడ లేకపోవడంతో వేసవిలో మాదిరిగా రాష్ట్రంలో వేడి వాతావరణం కొనసాగుతోంది. వారం, పది రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
విశాఖపట్నం, జూలై 12 (ఆంధ్రజ్యోతి): మేఘాల జాడ లేకపోవడంతో వేసవిలో మాదిరిగా రాష్ట్రంలో వేడి వాతావరణం కొనసాగుతోంది. వారం, పది రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. శనివారం నరసాపురంలో 39.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నెల్లూరులో 39.4, కావలిలో 39.1, తునిలో 38.5 డిగ్రీలు నమోదయ్యాయి. దేశంలో తమిళనాడు, కోస్తా, రాయలసీమల్లోనే ఎండలు, వేడి వాతావరణం కొనసాగుతున్నాయని, ఈ పరిస్థితి మరో రెండు రోజులు ఉంటుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈనెల 16న పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో 17వ తేదీ నుంచి కోస్తాలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తర ఒడిశాకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే తప్ప కోస్తాలో గట్టి వర్షాలు కురిసే పరిస్థితి లేదని, లేదంటే.. రుతుపవనద్రోణి తూర్పుభాగం దక్షిణాది వైపుగా రావాలని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.