National Energy Conservation Award: ఇంధన సంరక్షణలో ఏపీ టాప్
ABN , Publish Date - Dec 14 , 2025 | 05:09 AM
ఎనర్జీ ఎఫిషియన్సీ రంగంలో ఏపీ మరోసారి సత్తా చాటింది. వరుసగా నాలుగో ఏడాది జాతీయ ఇంధన సంరక్షణ అవార్డును సాధించింది.
వరుసగా 4వసారి జాతీయ ఇంధన సంరక్షణ పురస్కారం
నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం
ఏపీ తరఫున అందుకోనున్న ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్
అమరావతి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఎనర్జీ ఎఫిషియన్సీ రంగంలో ఏపీ మరోసారి సత్తా చాటింది. వరుసగా నాలుగో ఏడాది జాతీయ ఇంధన సంరక్షణ అవార్డును సాధించింది. ఈ అవార్డు ఇంధన సంరక్షణ, ఇంధన సామర్థ్య రంగాల్లో స్థిరంగా ముందుకు సాగుతున్న ఏపీ పురోగతిని ప్రతిబింబిస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పేర్కొన్నారు. ‘అన్ని ప్రధాన రంగాల్లో ఇంధన సామర్థ్య కార్యకలాపాల్లో పురోగతి కనబరిచాం. జాతీయ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు -2025లో గ్రూప్ -11 విభాగంలో మొదటి స్థానంలో నిలిచి అవార్డు కైవసం చేసుకోగలిగాలిగాం. విద్యుత్తు రంగంలో సాధిస్తున్న పురోగతి, విద్యుత్తు ఆదాలో రాష్ట్రం సాధించిన విజయాల్లో సీఎం చంద్రబాబు దూరదృష్టి, విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారం ఎంతో ముఖ్యమైనవి’ అని అన్నారు. ఈ సందర్భంగా ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సీఈవో నాగలక్ష్మి, ఆమె బృందాన్ని విజయానంద్ అభినందించారు. జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డు రాష్ట్రం తరపున ఎస్పీడీసీఎల్ సీఎండీ ఎల్. శివశంకర్ అందుకోనున్నారు.
ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మరింత బాధ్యతగా పనిచేస్తాం: నాగలక్ష్మి
జాతీయ అవార్డుపై స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సీఈవో నాగలక్ష్మి స్పందిస్తూ... ఇంధన సామర్థ్యాన్ని గరిష్ట స్థాయిలో పెంచేందుకు మరింత బాధ్యతగా పనిచేస్తామన్నారు. ఏపీ 89.25 పాయింట్లతో గ్రూప్-2లో అగ్రస్థానంలో ఉందని, గతేడాది కన్నా 2.3 శాతం ఎక్కువని ఆమె చెప్పారు.