Minister Nimmala Ramanaidu: వృధా జలాల వాడకంపై అభ్యంతరం ఎందుకు?
ABN , Publish Date - Dec 20 , 2025 | 05:44 AM
బంగాళాఖాతంలో కలిసిపోతున్న గోదావరి వృధా జలాలను దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వాడుకుంటామంటే ఎవరికి ఏ అభ్యంతరం ఉండాల్సిన ...
పోలవరం-నల్లమల సాగర్కు అనుమతులు ఇవ్వాలి: నిమ్మల
న్యూఢిల్లీ, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో కలిసిపోతున్న గోదావరి వృధా జలాలను దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వాడుకుంటామంటే ఎవరికి ఏ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి ఆయన కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో శ్రమశక్తి భవన్లో సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మంత్రి నిమ్మల మాట్లాడారు. ‘ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపాలి. ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు అందరూ బాగుండాలనేదే సీఎం చంద్రబాబు అభిమతం. తెలంగాణలోని అంతర్గత రాజకీయ పరిస్థితుల నేపథ్యం పోలవరం- నల్లమల్ల సాగర్ వివాదానికి కారణమై ఉండవచ్చు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం, సీతమ్మ సాగర్ తదితర ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ అడ్డు పడలేదు. అలాంటప్పుడు దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ వృధా జలాలను వాడుకుంటామంటే సహకరించాల్సిన అవసరం ఉంది’ అని నిమ్మల తెలిపారు. కాగా, పోలవరం ప్రాజెక్టులో వివిధ పనులకు పెండింగులో ఉన్న అనుమతులు వచ్చేలా చూడాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.