Education Department: పాల్ అమలులో రోల్ మోడల్ ఏపీ
ABN , Publish Date - Sep 11 , 2025 | 06:27 AM
వ్యక్తిగతీకరణ అనుకూల అభ్యాసం(పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్-పాల్) అమలులో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని నోబెల్ అవార్డు గ్రహీత ఆచార్య మైఖేల్ క్రెమర్ ప్రశంసించారు.
నోబెల్ గ్రహీత మైఖేల్ క్రెమర్ ప్రశంస
అమరావతి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): వ్యక్తిగతీకరణ అనుకూల అభ్యాసం(పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్-పాల్) అమలులో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని నోబెల్ అవార్డు గ్రహీత ఆచార్య మైఖేల్ క్రెమర్ ప్రశంసించారు. విద్యాశాఖ, సమగ్రశిక్ష ఉన్నతాధికారుల దూరదృష్టి, నాయకత్వం అభినందనీయమని అన్నారు. విద్యార్థుల అభ్యసనా ఫలితాల్లో పాల్ ప్రభావంపై క్రెమర్, అతని బృందం అధ్యయనం చేసింది. ఆ ఫలితాలను బుధవారం ఢిల్లీలో విడుదల చేశారు. పాల్ అమలులో ఉత్తమ ప్రదర్శన చూపించిన ఏపీ సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్(ఎ్సపీడీ) బి.శ్రీనివాసరావును అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీడీ మాట్లాడుతూ... ‘పాల్ అమలులో పాఠశాల విద్యాశాఖ కీలక పాత్ర పోషిస్తోంది. పాల్ ల్యాబ్స్ వినియోగంపై 2023 నుంచి 2025 వరకు కన్విజీనియస్ ఏఐ సంస్థ రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా 60 పాఠశాలల్లో అధ్యయనం చేశాం. పాల్ లేని పాఠశాలల్లోని విద్యార్థులతో పోలిస్తే పాల్ ల్యాబ్స్ ఉన్న విద్యార్థులు 2.35 రెట్లు ఎక్కువ అభ్యసన సామర్థ్యాలను ప్రదర్శించారు. 1,200కు పైగా పాఠశాలల్లో పాల్ అమలుచేస్తున్నాం’ అని చెప్పారు.