Share News

Economic Growth: సుస్థిర ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

ABN , Publish Date - Sep 10 , 2025 | 06:33 AM

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాభివృద్ధి గాడిన పడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వృద్ధి రేటు ఊపందుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 మొదటి త్రైమాసికం..

Economic Growth: సుస్థిర ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

  • 2025-26 మొదటి త్రైమాసికంలో 10.5% వృద్ధిరేటు

  • రంగాలవారీగా 11.91 శాతంతో ‘పరిశ్రమలు’ టాప్‌

  • జాతీయ సగటు వృద్ధిరేటు కంటే రాష్ట్రానిదే అధికం

  • మొత్తంగా ఆర్థిక ఏడాదిలో 17.1 శాతం సాధించాలి

  • ఆ దిశగా తదుపరి కార్యాచరణ తీసుకోవాలి

  • రవాణా, హోటళ్లు, రియల్‌ తదితర రంగాలపై దృష్టి

  • ప్రణాళిక శాఖ అధికారులకు సీఎం దిశానిర్దేశం

  • రెండంకెల వృద్ధి రేటుపై చంద్రబాబు సంతృప్తి

అమరావతి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాభివృద్ధి గాడిన పడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వృద్ధి రేటు ఊపందుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో రాష్ట్ర జీఎ్‌సడీపీ 10.5 శాతం వృద్ధిరేటు సాధించిందని, ఇది జాతీయ సగటు వృద్ధిరేటు 8.8 శాతం కంటే ఎక్కువని ప్రణాళిక శాఖ అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. గత ఏడాది ఇదే సమయంలో రాష్ట్రంలో 9.58 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. వృద్ధిరేటు గణాంకాలు, ఆర్థిక సంవత్సరం మొత్తం వృద్ధిరేటు అంచనాలపై సీఎం మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక మార్గనిర్దేశం చేశారు. సుస్థిర ఆర్థిక వ్యవస్థను సాధించేందుకు వృద్ధి లక్ష్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని, త్రైమాసిక ఫలితాలకు తగ్గట్టుగా తదుపరి కార్యాచరణ ఉండాలని అన్నారు. రెండంకెల వృద్ధి రేటుపై సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న 17.1 శాతం వృద్ధి సాధనకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. కొన్ని రంగాలు ఎందుకు పురోగతి సాధించడం లేదనే దానిపై కారణాలు తెలుసుకునేందుకు నిపుణులతో ప్రత్యేకంగా అధ్యయనం జరపాలని సూచించారు. పర్యాటకంలో ప్రస్తుతం సాధించిన 17.08 శాతం పురోగతి సరిపోదని.. ఈ రంగంలో 25 శాతం వృద్ధికి అవకాశం ఉందని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వృద్ధిలోనూ అంతర్జాతీయ లక్ష్యాలను అందుకోవాలన్నారు. రైల్వేలు, రవాణా, హోటళ్లు, కమ్యూనికేషన్స్‌, బ్యాంకింగ్‌, బీమా, రియల్‌ ఎస్టేట్‌ వంటి రంగాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. శాఖలు, రంగాలు, నియోజకవర్గాల వారీగా జీఎ్‌సడీపీ వివరాలను లోతుగా నమోదు చేయాలని సూచించారు.


పరిశ్రమల రంగంలో అత్యధిక వృద్ధి

2025-26 తొలి త్రైమాసికంలో రాష్ట్ర జీఎ్‌సడీపీలో వృద్ధి జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని ప్రణాళికా విభాగం అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. జీవీఏ రూ.3,57,894 కోట్లుగా వెల్లడించారు. గత ఏడాది ఇదే సమయంలో రాష్ట్రంలో 9.58 శాతం వృద్ధి నమోదు కాగా, ఈ ఏడాది 10.5 శాతం సాధ్యమైందని పేర్కొన్నారు. ఏపీ జీఎ్‌సడీపీ వృద్ధిని రంగాలవారీగా పరిశీలిస్తే పరిశ్రమల శాఖలో 11.91 శాతం, వ్యవసాయ రంగంలో 9.60 శాతం, సేవల రంగంలో 10.76 శాతం వృద్ధి కనిపిస్తోందని తెలిపారు.

వ్యవసాయ అనుబంధ రంగాలు

తొలి త్రైమాసికం ప్రస్తుత ధరల ప్రకారం పశుపోషణ ఉత్పత్తి విలువ రూ.46,751 కోట్లు (6.65 శాతం వృద్ధిరేటు), చేపల పెంపకం-ఆక్వాకల్చర్‌ ఉత్పత్తి విలువ రూ.32,110 కోట్లు (14.52 శాతం వృద్ధి)గా ఉంది. మాంసం ఉత్పత్తి 3.15 లక్షల టన్నులకు (8 శాతం వృద్ధి) పెరగ్గా.. గుడ్ల ఉత్పత్తి 621.57 కోట్ల నుంచి 674.5 కోట్లకు చేరింది.

పరిశ్రమల రంగం: మైనింగ్‌-క్వారీయింగ్‌లో ఆదాయం రూ.10,686 కోట్లు (43.54 శాతం వృద్ధి), తయారీ రంగం రూ.40,515 కోట్లు (9.93 శాతం వృద్ధి), నిర్మాణ రంగం రూ.31,550 కోట్లు (9.57 శాతం వృద్ధి) ఉండగా.. రోడ్‌ మెటల్‌, బ్లాక్‌ గ్రానైట్‌, కలర్‌ గ్రానైట్‌ ఉత్పత్తి పెరిగింది.

సేవారంగం: హోటళ్లు, రవాణా-పర్యాటక రంగం ఆదాయం రూ.25,702 కోట్లు (17.92 శాతం వృద్ధి), రియల్‌ ఎస్టేట్‌-వృత్తిపరమైన సేవలు రూ.34,324 కోట్లు (11.7 శాతం వృద్ధి) ఉండగా.. పర్యాటకులు 6.89 కోట్ల నుంచి 8.07 కోట్లకు (17.08 శాతం వృద్ధి) పెరిగారు. విమాన ప్రయాణికులు 13.09 లక్షల నుంచి 15.85 లక్షలకు (21.1 శాతం వృద్ధి) పెరిగారు.

Updated Date - Sep 10 , 2025 | 06:33 AM