CM Chandrababu: అమరావతి స్పెషల్
ABN , Publish Date - Sep 03 , 2025 | 04:17 AM
రాజధాని అమరావతిలో కీలక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు...
రాజధాని ప్రాజెక్టులకు ఎస్పీవీ
వేగవంతంగా పూర్తికి చర్యలు
గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు సహా అన్ని నిర్మాణాలకూ వర్తింపు
అర్బన్ డిజైన్లు, ఆర్కిటెక్చరల్ గైడ్లైన్స్ నోటిఫికేషన్కు ఓకే
కన్వెన్షన్ సెంటర్లకు భూములు
సీఆర్డీఏ అథారిటీ భేటీలో 7 అంశాలకు సీఎం ఆమోదం
అమరావతి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో కీలక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు నేతృత్వంలో 52వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఏడు అంశాలకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. రాజధాని పరిధిలో చేపట్టే కీలక ప్రాజెక్టులు వేగంగా కార్యరూపం దాల్చేలా స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ, రివర్ఫ్రంట్, రోప్వే, ఇన్నర్రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టుల పనులు త్వరిత గతిన పూర్తయ్యేందుకు ఎస్పీవీ దోహదపడుతుంది. అయితే, ఎస్పీవీ పరిధిలోకి బయో డిజైన్ ప్రాజెక్టును కూడా తీసుకురావాలని అధికారులకు సీఎం సూచించారు. స్పోర్ట్స్ సిటీ తరహాలోనే హెల్త్సిటీ కూడా అమరావతిలో ఏర్పాటు కానుందని.. దాని పరిధిలో బయో డిజైన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. ప్రజారోగ్య సేవల నిమిత్తం బయోడిజైన్ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉండేందుకు 7 దేశాలకు చెందిన నిపుణులు, సంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఆయా ప్రాజెక్టుల డిజైన్, నిధులు సమకూర్చడం మొదలు నిర్మాణం పూర్తయ్యేంత వరకు ఎస్పీవీనే పూర్తి బాధ్యత వహించనున్నట్లు అధికారులు వివరించారు.
మౌలిక సదుపాయాలపై దృష్టి
అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయం కోసం మౌలిక సదుపాయాల కల్పన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన టెండర్కు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. ఆ భవనాల సముదాయానికి అనుసంధానంగా రహదారులు, పుట్పాత్ల నిర్మాణం పనులు మొదలు కానున్నాయి. దీనిలో భాగంగా 53.68 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో పాటు ఏడేళ్లపాటు వాటి నిర్వహణ బాధ్యతను కూడా టెండర్ దక్కించుకున్న సంస్థే చేపట్టేలా నిబంధన పెట్టినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాజధాని అర్బన్ డిజైన్లు, ఆర్కిటెక్చరల్ మార్గదర్శకాల నోటిఫికేషన్ జారీకి అథారిటీ ఆమోదం తెలిపింది. డిజైన్లపై జాగ్రత్తలు తీసుకోవాలని, అమరావతి నగరం ఆకర్షణీయంగా కనిపించేలా ఉండాలని చంద్రబాబు సూచించారు. ప్రతి కట్టడమూ ప్రజలను ఆకర్షించేలా ఉండాలని స్పష్టం చేశారు. సీఆర్డీఏ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులతో కార్యకలాపాలు పెరిగాయని అధికారులు చెప్పగా.. ఈ మేరకు అవసరమైన సిబ్బందిని డిప్యూటేషన్, ఆన్డ్యూటీ విధానంలో నియమించుకునేందుకు సీఎం అనుమతించారు.
అదనంగా భూములు
రాజధాని పరిధిలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం కొన్ని ప్రముఖ హోటళ్లు ముందుకు వచ్చాయని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే కొన్ని ప్రముఖ హోటళ్లకు భూములు కేటాయించామని.. వాటికి అనుబంధంగా కొందరు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో అదనంగా భూములు కేటాయించాలని కోరినట్టు చెప్పారు. నిర్మాణాలు ప్రపంచ ప్రమాణాలకు ధీటుగా ఉండాలని సూచిస్తూ.. ముందుకొచ్చిన సంస్థలకు కన్వెన్షన్ సెంటర్ల నిమిత్తం భూములు ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. మాస్టర్ ప్లాన్ అవసరాలకు అనుగుణంగా ఏమైనా భూసేకరణ చేపట్టాలంటే రైతులతో మాట్లాడి ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. కృష్ణానదిలోని ద్వీపాలను అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించేలా చూడాలని చంద్రబాబు సూచించారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణతో పాటు మున్సిపల్, సీఆర్డీఏ, ఏడీసీ సహా వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.