Cheaper Medicines: నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మరింత చౌక ధరల్లో మందులు
ABN , Publish Date - Apr 12 , 2025 | 05:27 AM
కృత్రిమ మేధలాంటి నూతన సాంకేతికతలతో మందుల ఉత్పత్తి మరింత చౌకగా మారనుందని ఆరోగ్య కమిషనర్ వీరపాండియన్ అన్నారు. ఫార్మా, బయోటెక్ రంగాల్లో ఏపీ, కర్నాటక సంయుక్తంగా ముందుకు సాగనున్నాయి

ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్
గుంటూరు మెడికల్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): ఫార్మా రంగంలోకి కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశించడంతో భవిష్యత్తులో మరింత చౌక ధరల్లో మందులు తయారయ్యే అవకాశం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వి. వీరపాండియన్ తెలిపారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్ (బెంగళూరు) ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరులోని ఒక హోటల్లో జరిగిన ఫార్మా టెక్ కన్వర్జ్ 2025లో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. భారత్ జనరిక్ మందులు, వ్యాక్సిన్లను పాశ్చాత్య దేశాలకు తక్కువ ధరలకే ఎగుమతి చేస్తున్నట్టు వివరించారు. ఫార్మాలో ఏపీ బలంగా ఉందని, బయోటెక్నాలజీ రంగంలో కర్నాటకకు మంచి గుర్తింపు ఉందన్నారు. కర్నాటకతో కలసి ఫార్మా, బయో టెక్నాలజీ రంగాల్లో పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.