Minister Achennayudu : సొసైటీల్లో భారీ దోపిడీ
ABN , Publish Date - Mar 18 , 2025 | 06:17 AM
‘చరిత్రలో ఎన్నడూ చూడనివిధంగా వైసీపీ పాలనలో వ్యవసాయ సహకార సంఘాలను దోచేశారు..
అవినీతిపరుల్ని వదిలిపెట్టం: అసెంబ్లీలో మంత్రి అచ్చెన్న
అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ‘చరిత్రలో ఎన్నడూ చూడనివిధంగా వైసీపీ పాలనలో వ్యవసాయ సహకార సంఘాలను దోచేశారు.. పీఏసీఎ్సల నుంచి డీసీసీబీ వరకూ ఎక్కడా వదిలి పెట్టలేదు.. సిగరెట్ పెట్టె ముక్కపై సొసైటీ సెక్రటరీ చీటి రాసి పంపితే ఊరు, పేరూ లేనివారికి లోన్లు ఇచ్చేశారు. చర్యలకు ఉపక్రమించగానే కోర్టుకు వెళ్లి స్టే తెస్తున్నారు. దీంతో చేతులు కట్టేసినట్లు అవుతోంది’ అని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో చెప్పారు.
సహకార బ్యాంకుల్లో అవినీతిపై ఎమ్మెల్యేలు బూర్ల రామాంజినేయులు, కూన రవికుమార్, యార్లగడ్డ వెంకట్రావు, దూళిపాళ్ల నరేంద్ర అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ... ఇప్పటి వరకూ 13 డీసీసీబీలపై ఆరోపణలు రావడంతో విచారణ జరిపించి ఆరుగురిపై చర్యలు తీసుకున్నామని మంత్రి చెప్పారు. ఎవరినీ వదిలిపెట్టబోమని సభ్యులకు హామీ ఇచ్చారు.