సంక్షోభంలో వ్యవసాయ రంగం
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:32 AM
రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి ఆరోపించారు.
రైతులందరికీ యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం
‘అన్నదాత పోరు’లో వైసీపీ నాయకులు
నంద్యాల రూరల్, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి ఆరోపించారు. యూరియా బ్లాక్ మార్కెట్పై ‘అన్నదాత పోరు’లో భాగంగా బొమ్మలసత్రం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్డీవో చల్లా విశ్వనాథ్కు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ యూరియా దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలను వదిలి యూరియా కోసం టీడీపీ నాయకుల నివాసాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. యూరియా పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. యూరియా పుష్కలంగా ఉందని ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు చెబుతున్నారని, ఎక్కడ ఉందో చూపాలని డిమాండ్ చేశారు. రైతులకు పార్టీలు అంటగట్టడం మంచి పద్ధతి కాదన్నారు. పార్టీలకు అతీతంగా యూరియా పంపిణీ చేయాలని కోరారు. పంటలకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇషాక్బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, నంద్యాల మున్సిపల్ చైర్మన మాబున్నీసా, ఎంపీపీ ప్రభాకర్ తదితరుల పాల్గొన్నారు.