సమస్యలు పరిష్కరించాక పనులు చేపట్టండి
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:01 AM
పర్యాటక ప్రాంతమైన గండికోటలో సమస్యలు పరిష్కరించాకే అభివృ ద్ధి పనులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
జమ్మలమడుగు, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): పర్యాటక ప్రాంతమైన గండికోటలో సమస్యలు పరిష్కరించాకే అభివృ ద్ధి పనులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. రెండు రోజుల క్రితం గండికోట ఎదురుగా లోయకు వెళ్లే దారి సిమెంటు రోడ్డు నిర్మాణానికి డోజర్తో పనులు చేస్తుండగా ఒక్కసారిగా గ్రామస్థులు వచ్చి అడ్డుకున్న విషయం విధితమే. అందులో భాగంగా సోమవారం గ్రామ సర్పంచ్ ఈశ్వర్, కూటమి నాయకులు, మహిళలు వచ్చి తమ సమస్యలు పరిష్కరించేదాకా గండికోటలో ఎటువంటి పనులు చేయరాదని చేస్తే తగిన ఇబ్బందులు పడుతారని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. దీంతో విషయం తెలుసుకున్న తహసీల్దారు శ్రీనివాసరెడ్డి గండికోట సందర్శించారు. ఈ విషయంగా సర్పంచ్ ఈశ్వర్తోపాటు గ్రామస్థులు తహసీల్దార్ను కలిసి గండికోట పర్యాటక ప్రాంతాన్నితిలకించేందుకు వచ్చేవారి నుంచి వసూలు చేసే టోల్గేటులో గ్రామ పంచాయతీకి 25 శాతం నిధులు ఇస్తామని చెప్పి ఇంతవరకు సంబందిత శాఖ అధికారులు పట్టించుకోలేదన్నారు. గండికోటలో ఇప్పటి వరకు సక్రమంగా సెల్టవర్లు పనిచేయవని, తాగునీటి సమస్య ఉందని, కోట ఎదురుగా కత్తుల కోనేరు ఎండిపోయిందని, కోటకు సంబందించిన గోడలు అక్కడక్కడ రాళ్లు పడిపోయాయని తెలిపారు. గండికోటలో సమస్యలు పరిష్కరించిన తర్వాత పనులు ప్రారంభించాలని తాము అభివృద్ధికి అడ్డంకి కాదని వారన్నారు.