ఆదిత్య ఫార్మసీ చైర్మన్ నరసింహరాజు ఆత్మహత్య
ABN , Publish Date - Jul 06 , 2025 | 01:20 AM
:అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక ఆదిత్య ఫార్మసీ చైర్మన్ నరసింహరాజు ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడలో శనివారం జరిగింది.
అప్పు ఇచ్చిన వాళ్లు వేధిస్తున్నారని లేఖ
క్షత్రియ భవన్లో ఉరిపోసుకుని బలవన్మరణం
హత్య కేసులో నిందితుడిగా ఉన్న మృతుడు
విజయవాడ/అజితసింగ్నగర్, జూలై 5(ఆంధ్రజ్యోతి): అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక ఆదిత్య ఫార్మసీ చైర్మన్ నరసింహరాజు ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే... విజయవాడ అయోధ్యనగర్కు చెందిన సాగి వెంకట నరసింహరాజు(55)కు లోటస్ ల్యాండ్మార్క్ గేటెడ్ కమ్యూనిటీలో సొంతిల్లు ఉంది. అనేక సంవత్సరాల క్రితం ఆదిత్య ఫార్మసీ పేరుతో మందుల షాపులను ఏర్పాటు చేశారు. వ్యాపారంలో స్నేహితులు, బంధువులను భాగస్వాములుగా చేర్చుకున్నారు. విజయవాడతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో మరిన్ని శాఖలు ఏర్పాటు చేశారు. ఆయనకు వివిధ రాషా్ట్రల్లో సుమారుగా 135 షాపులు ఉన్నాయి. వ్యాపారంలో స్థిరపడడంతో హైదరాబాద్లో ఇంటిని సమకూర్చుకుని కుటుంబాన్ని అక్కడికి మార్చారు. అప్పుడప్పుడు లోటస్లో ఉన్న ఇంటికి వచ్చి వ్యాపార లావాదేవీలు చూసుకుంటారు. నాలుగు రోజుల క్రితం భార్య శాంతితో కలిసి నరసింహరాజు కారులో విజయవాడకు వచ్చారు. ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయని, రెండు రోజుల తర్వాత వస్తానని చెప్పి శుక్రవారం ఉదయం భార్య శాంతిని హైదరాబాద్ పంపేశారు.
పరందామయ్య, శివాజీరాజు ఒత్తిడి వల్లే..
నరసింహరాజు వ్యాపారంలో విజయవాడ ఆర్టీసీ కాలనీకి చెందిన ఆడిటర్ పిన్నమనేని పరందామయ్య, విశాఖపట్నం సీతమ్మధార ప్రాంతానికి చెందిన ఫార్మా కంపెనీ అధినేత శివాజీరాజుతో పాటు మరికొంతమంది భాగస్వాములుగా ఉన్నారు. కొంత మంది నుంచి నరసింహరాజు అప్పులు తీసుకున్నారు. ఆస్తులను విక్రయించి అప్పులు తీర్చడంతోపాటు ఫార్మసీలో పెట్టుబడులు పెట్టిన వారికి వాటిని వెనక్కి ఇచ్చేసి మొత్తం ‘ఆదిత్య’ తనదే అనిపించుకుంటానని స్పష్టం చేశారు. పరందామయ్య, శివాజీరాజు బకాయిలు తీర్చాలని బాగా ఒత్తిడి చేశారు. విశాఖ నుంచి శివాజీరాజు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లో ఇంటికి వెళ్లి గొడవ చేశారు. నరసింహరాజుకు బంధువైన శివాజీరాజు ఫోన్లో అనరాని మాటలు అనడంతో ఆయన మనస్తాపం చెందారు.
వాకింగ్కు వెళ్లి వస్తానని డ్రైవర్తో చెప్పి..
శనివారం ఉదయం వాకింగ్కు వెళ్లి వస్తానని డ్రైవర్తో చెప్పి నరసింహరాజు అయోధ్యనగర్లోని క్షత్రియ భవన్కు వెళ్లారు. ఈ భవన్కు కొద్దినెలల క్రితం వరకు ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. బాతరూంకు వెళ్లి వస్తానని వాచ్మన్తో చెప్పి పైఅంతస్తులో ఉన్న గదిలోకి వెళ్లారు. పిట్టగోడ దూకి చిన్న సందులోకి వెళ్లి వెంట తీసుకెళ్లిన తాడును ఏసీ కంప్రషర్ హాండిల్స్కు బిగించి ఉరిపోసుకున్నారు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను కాగితంపై రాసి ప్యాంటు జేబులో పెట్టుకున్నారు. దీనిపై అజితసింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నరసింహరాజు మృతదేహానికి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు. జరిగిన ఘటనపై నరసింహరాజు భార్య శాంతి పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. పరందామయ్య, శివాజీరాజు వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన జేబులో ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరసింహరాజు ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు.