Educational Schedule: పది పరీక్షలకు 100 రోజుల ప్రణాళిక
ABN , Publish Date - Nov 15 , 2025 | 06:23 AM
పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది.
డిసెంబరు 6 నుంచి మార్చి 15 వరకు
అమరావతి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. డిసెంబరు 6 నుంచి మార్చి 15 వరకు యాక్షన్ ప్లాన్ అమలుకు షెడ్యూలు రూపొందించింది. దీని ప్రకారం.. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 9 గంటల వరకు రోజుకో పాఠ్యాంశంపై రెమిడియల్ తరగతులు నిర్వహిస్తారు. 9.15 నుంచి 4గంటల వరకు నాలుగు పాఠ్యాంశాలపై తరగతులు నిర్వహిస్తారు. సాయంత్రం పాఠశాల పనివేళల అనంతరం 4 నుంచి 5 గంటల వరకు రోజుకో పాఠ్యాంశంపై అసె్సమెంట్ తరగతి నిర్వహిస్తారు. జనవరి 5 నుంచి ఫార్మేటివ్ అసె్సమెంట్-3 పరీక్షలు జరుగుతాయి. సంక్రాంతి సెలవుల్లో రోజుకు నాలుగు సబ్జెక్టులు విద్యార్థులు చదవాలి. ఫిబ్రవరి 26 నుంచి ప్రీఫైనల్ పరీక్షలు, మార్చి 2 నుంచి గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తారు. మార్చి 16 నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతాయి. కాగా, పది పరీక్షల షెడ్యూలు ప్రకటించాల్సి ఉంది. వంద రోజుల యాక్షన్ ప్లాన్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు.