ACB Court: ఆ 11 కోట్లను ప్రత్యేకంగా ఉంచండి
ABN , Publish Date - Aug 03 , 2025 | 04:21 AM
మద్యం కుంభకోణం కేసులో సిట్ స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్లను ప్రత్యేకంగా ఉంచాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
సిట్కు ఏసీబీ కోర్టు ఆదేశం
విజయవాడ, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో సిట్ స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్లను ప్రత్యేకంగా ఉంచాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, వాటిలో 2024 తర్వాత ముద్రించిన నోట్లు ఉండే అవకాశం ఉందని నిందితుడు రాజ్ కసిరెడ్డి కోర్టుకు చెప్పుకున్నారు. ఆ నగదు సీరియల్ నంబర్లను నమోదు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు శనివారం పిటిషన్ వేశారు. దీనిపై న్యాయాధికారి పి.భాస్కరరావు విచారణ చేశారు. నగదును బ్యాంకులో డిపాజిట్ చేశామని సిట్ దర్యాప్తు అధికారి శ్రీహరిబాబు కోర్టుకు వివరించారు. దీంతో రూ.11 కోట్లను ఇతర నోట్లతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచాలని న్యాయాధికారి ఉత్తర్వులిచ్చారు. దీనిపై బ్యాంకు అధికారులకు కూడా నోటీసు ఇచ్చారు. కాగా, స్వాధీనం చేసుకున్న నగదును సిట్ అధికారులు విజయవాడ ఆటోనగర్ ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో డిపాజిట్ చేశారు.