ఏసీ బోగీలే టార్గెట్
ABN , Publish Date - Aug 29 , 2025 | 01:21 AM
అతడి గురించి ఎవరిని అడిగినా మార్బుల్ పని చేస్తుంటాడని చెబుతారు. అతడి దృష్టి మాత్రం ఎప్పుడూ రైళ్లలోని ఏసీ బోగీలపైనే ఉంటుంది. రైలు గుర్తుకొచ్చినప్పుడల్లా స్టేషన్కు వెళ్లి ఒక సాధారణ టికెట్ కొనుగోలు చేస్తాడు. దానితో ఏసీ బోగీ ఎక్కుతాడు. బోగి మొత్తం అటూఇటూ తిరుగుతాడు. తర్వాత ఏ వస్తువు కనిపిస్తే దాన్ని తీసుకుని ఆఫ్సైడ్ దిగి వెళ్లిపోతాడు. ఇలా విజయవాడ రైల్వేస్టేషన్ కేంద్రంగా రైళ్లలో వరుస చోరీలు చేస్తున్న యువకుడ్ని రైల్వే పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను డీఎస్పీ రత్నరాజు, జీఆర్పీ ఇన్స్పెక్టర్ జీవీ రమణ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఫతే అలీబేగ్ వెల్లడించారు.
- రైళ్లలో మార్బుల్ వర్కర్ చేతివాటం
- 16న గుజరాతకు చెందిన కుటుంబం ఆభరణాల బ్యాగ్ చోరీ
- నిందితుడిని పట్టుకున్న రైల్వే పోలీసులు
- రూ.8 లక్షల ఆభరణాలు స్వాఽధీనం
- నిందితుడిపై పలు చోరీ కేసులు
అతడి గురించి ఎవరిని అడిగినా మార్బుల్ పని చేస్తుంటాడని చెబుతారు. అతడి దృష్టి మాత్రం ఎప్పుడూ రైళ్లలోని ఏసీ బోగీలపైనే ఉంటుంది. రైలు గుర్తుకొచ్చినప్పుడల్లా స్టేషన్కు వెళ్లి ఒక సాధారణ టికెట్ కొనుగోలు చేస్తాడు. దానితో ఏసీ బోగీ ఎక్కుతాడు. బోగి మొత్తం అటూఇటూ తిరుగుతాడు. తర్వాత ఏ వస్తువు కనిపిస్తే దాన్ని తీసుకుని ఆఫ్సైడ్ దిగి వెళ్లిపోతాడు. ఇలా విజయవాడ రైల్వేస్టేషన్ కేంద్రంగా రైళ్లలో వరుస చోరీలు చేస్తున్న యువకుడ్ని రైల్వే పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను డీఎస్పీ రత్నరాజు, జీఆర్పీ ఇన్స్పెక్టర్ జీవీ రమణ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఫతే అలీబేగ్ వెల్లడించారు.
విజయవాడ, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి):
గుంటూరుకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ భవానీపురంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు. మార్బుల్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నట్టుగా వ్యవహరిస్తాడు. మార్బుల్ పనికి వెళ్లే రెహ్మాన్కు చేతివాటం బాగా ఉంది. ఇంటి నుంచి పనికి వెళ్తున్నట్టు బయలుదేరిన రెహ్మాన్ నేరుగా విజయవాడ రైల్వేస్టేషన్కు చేరుకుంటాడు. అక్కడ ప్లాట్ఫాంలపై తిరుగుతూ వచ్చేపోయే రైళ్లలో ఏసీ బోగీలపై కన్నేస్తాడు. లోపలకు వెళ్లి పరిస్థితి తనకు అనుకూలంగా ఉంటే సెకన్ల వ్యవధిలో వస్తువులు మాయం చేస్తాడు.
సెల్ఫోన్లతో మొదలై...
రెహ్మాన్ ఇంతకుముందు రైల్వేస్టేషన్ తిరుగుతూ సెల్ఫోన్లను చోరీ చేసేవాడు. ఈ కేసుల్లో పోలీసులు పలుమార్లు అరెస్టు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రెహ్మాన్ టార్గెట్ మార్చుకున్నాడు. గుజరాతకు చెందిన కొహీజం అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యక్రమానికి బయలుదేరారు. మొత్తం ఐదుగురు కుటుంబ సభ్యులు ఈ నెల 15న గుజరాతలో భగతకోటి ఎక్స్ప్రెస్ ఏ1 బోగీలో ఎక్కారు. ఈ రైలు 16వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ రైల్వేస్టేషన్లోని ఏడో నంబరు ప్లాట్ఫాంకు చేరుకుంది. అక్కడ 15-20 నిమిషాలు ఆగింది. అక్కడే ఉన్న రెహ్మాన్ ఏ1 బోగీలోకి ఎక్కాడు. కాసేపు లోపల తచ్చాడాడు. కొహీజం కుటుంబం మొత్తం నిద్రలో ఉండటంతో బెర్త్ కింద ఉన్న బ్యాగ్ను మాయం చేశాడు. రైలు స్టేషన్ నుంచి కొంతదూరం వెళ్లిపోయిన తర్వాత చూసుకోగా బ్యాగ్ కనిపించలేదు. దీంతో ఆయన రైల్ మదాద్ టోల్ఫ్రీ నంబరు 139కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం జీఆర్పీ పోలీసులకు అందింది. బాధితులు తిరిగి గుజరాత వెళ్లే మార్గంలో 24వ తేదీన జీఆర్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారు వెంటనే రంగంలో దిగి సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా రైలు బోగీలోకి ప్లాట్ఫాంపై నుంచి ఎక్కినట్టు కనిపించింది. బ్యాగ్ తీసుకుని ఆఫ్సైడ్ (బోగీ రెండో ద్వారం వైపు) దిగినట్టు కనిపించింది. ఈ బ్యాగ్ను తీసుకుని ట్రాక్పై నుంచి ఎనిమిదో నంబరు ప్లాట్ఫాంపైకి వెళ్లి నడుచుకుంటూ వచ్చిన మార్గంలోనే వెళ్లిపోయాడు. నిందితుడి కోసం పోలీసులు మొత్తం 104 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఆ రోజున సెల్టవర్ లొకేషన్లను విశ్లేషించారు. దీని ద్వారా రెహ్మాన్ ఈ చోరీ చేసినట్టు గుర్తించారు. ఈ బ్యాగ్ను ఇంటికి తీసుకెళ్లి భద్రంగా ఉంచాడు. అవసరాల కోసం అందులో ఉన్న ఒక బంగారు ఉంగరం, గొలుసును తాకట్టు పెట్టాడు. ఈ డబ్బులు అయిపోయిన తర్వాత మిగిలిన వస్తువులను తాకట్టు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. వన్టౌన్లో రెహ్మాన్ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి మొత్తం రూ.10,61,318 బంగారు వస్తువులు, సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.8లక్షల ఆభరణాలు కొహీజం కుటుంబానికి సంబంధించినవే. నిందితుడిపై ఇంతకుముందు సెల్ఫోన్ చోరీ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.