navya : ప్రవక్త పశ్చాత్తాపం
ABN , Publish Date - May 17 , 2024 | 12:12 AM
మహాత్ముడిగా ప్రసిద్ధి చెందిన యూనుస్ ప్రవక్త ఒక రోజు ఓడలో సముద్ర ప్రయాణం చేస్తున్నారు. ఆయనతో పాటు మరికొందరు కూడా ఆ ఓడలో ఉన్నారు. కొంతసేపటికి హఠాత్తుగా తీవ్రమైన గాలి చెలరేగింది. దాంతో ఓడ చిగురుటాకులా వణికిపోతోంది.
![navya : ప్రవక్త పశ్చాత్తాపం](https://media.andhrajyothy.com/media/2024/20240511/Untitled_3_copy_098ab876b5.jpg)
సందేశం
మహాత్ముడిగా ప్రసిద్ధి చెందిన యూనుస్ ప్రవక్త ఒక రోజు ఓడలో సముద్ర ప్రయాణం చేస్తున్నారు. ఆయనతో పాటు మరికొందరు కూడా ఆ ఓడలో ఉన్నారు. కొంతసేపటికి హఠాత్తుగా తీవ్రమైన గాలి చెలరేగింది. దాంతో ఓడ చిగురుటాకులా వణికిపోతోంది. పర్వతాల్లా ఎగసిపడుతున్న అలల తాకిడికి తల్లకిందులైపోతోంది. ఓడలో చాలా సామాను ఉంది. ప్రయాణికులు తమ సామాన్లను పడవలోంచి బయటకు విసిరేయసాగారు.
అయినా పడవలో బరువు ఇంకా ఎక్కువగా ఉంది. కనీసం ఒక వ్యక్తిని బయటకు పంపితే... బరువు తగ్గుతుందనీ, మిగిలినవారందరూ బతుకుతారనీ అనుకున్నారు. చీటీలు వేశారు. అందులో యూనుస్ ప్రవక్త పేరు వచ్చింది. ఆయన గురించి వారందరికీ బాగా తెలుసు. ఎంతో మంచివాడు, గౌరవనీయుడు, సత్యవంతుడు. అలాంటి వ్యక్తిని సముద్రంలో వదిలేయడం వారికి ఇష్టం లేదు. అందుకని మళ్ళీ చీటీలు వేశారు.
ఈసారి కూడా ఆయన పేరే వచ్చింది. అందులో అల్లాహ్ అభీష్టం ఉందని యూనుస్ గుర్తించారు. లేచి నిలబడి, సముద్రంలోకి దూకారు. భారీ అలల్లో కలిసిపోయారు. ఆయన కళ్లు తెరిచేసరికి... తడిగా, మెత్తగా ఉన్న ఒక నేల మీద ఉన్నట్టు అనిపించింది. తన చుట్టూ ఉన్న ప్రదేశం మూసివేసిన గుహలా ఉంది. పూర్తి చీకటిగా ఉంది. కానీ తను ఉన్న చోటు మృదువుగా, మెత్తగా ఉంది. అలల్లో పడవలా కుదుపులు తెలుస్తున్నాయి. చివరికి... తను ఒక పెద్ద చేప కడుపులో ఉన్నట్టు ఆయన గ్రహించారు. తుపాను సముద్రంలో తనను కాపాడడానికి... తనను చేప మింగేలా అల్లాహ్ చేశాడని తెలుసుకున్నారు. వెంటనే తను చేసిన పొరపాటును ఆయన గ్రహించారు.
ఆ కాలంలో ప్రవక్తలు చేసే ఏ కార్యానికైనా అల్లాహ్ అనుమతిని తీసుకోవాలి. కానీ సముద్రంలో దూకేముందు అల్లాహ్ అనుమతిని యూనుస్ తీసుకోలేదు. ‘‘అల్లాహ్! నీ అనుమతి తీసుకోకుండా సముద్రంలోకి దూకాను.
అయినా నన్ను కాపాడావు. ఇది నీ ఔన్నత్యం’’ అంటూ పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు. అనంత కరుణామయుడైన అల్లాహ్ ఆ ప్రార్థనను ఆలకించాడు. ఆయనను బయటకు విడిచిపెట్టేలా ఆ చేపకు అల్లాహ్ ఆజ్ఞ ఇచ్చాడు. తక్షణమే ఎవరో తనను బయటకు తోస్తున్న అనుభూతి యూను్సకు కలిగింది. మరుక్షణంలో ఆయన నేల మీదకు వచ్చి పడ్డారు. అల్లా్హకు శతకోటి వందనాలు అర్పించుకుంటూ... తన గమ్యానికి యూనుస్ ప్రవక్త బయలుదేరారు.
మహమ్మద్ వహీదుద్దీన్