Tarakaratna: తారకరత్నకు కన్నీటి వీడ్కోలు.. కడసారిగా తారకరత్న నుదిటిపై..

ABN , First Publish Date - 2023-02-20T16:47:06+05:30 IST

తారకరత్న(Tarakaratna)కు కన్నీటి వీడ్కోలు పలికారు. చివరిసారి తారకరత్న నుదిటిపై తండ్రి మోహనకృష్ణ (Mohanakrishna) ముద్దుపెట్టి కంటతడి పెట్టారు.

Tarakaratna: తారకరత్నకు కన్నీటి వీడ్కోలు.. కడసారిగా తారకరత్న నుదిటిపై..

హైదరాబాద్: తారకరత్న(Tarakaratna)కు కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. తండ్రి మోహన్‌కృష్ణ చేతుల మీదుగా అంత్యక్రియలు పూర్తయ్యాయి. తారకరత్న చితికి మోహనకృష్ణ నిప్పుపెట్టారు. చివరిసారి తారకరత్న నుదిటిపై తండ్రి మోహనకృష్ణ (Mohanakrishna) ముద్దుపెట్టి కన్నీరుమున్నీరయ్యారు. ఈ దృశ్యాలు అక్కడున్నవారిని సహా, టీవీలలో చూసినవారిని కలచివేశాయి. కాగా తారకరత్న పాడెను చిన్నాన్న రామకృష్ణ (Ramakrishna), బాలకృష్ణ, ఇతర బంధువులు మోసి రుణం తీర్చుకున్నారు. భారమైన హృదయాలతో తారకరత్నను చంద్రబాబు, ఎంపీ విజయసాయి, బాలకృష్ణ, టీడీపీ నేత అచ్చెన్నాయుడు, కుటుంబసభ్యులు, అభిమానులు సాగనంపారు. అంత్యక్రియల్లో నందమూరి కుటుంబసభ్యులు, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ పాల్గొన్నారు.

Untitled-3.jpg

అంతకుముందు ఫిల్మ్‌ఛాంబర్‌ నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్తానం వరకు కొనసాగింది. ఆయనను కడసారి చూసేందుకు భారీగా అభిమానులు, నందమూరు ఫ్యాన్స్ తరలివచ్చారు. వివాదరహితుడైన తారకరత్న అంటే అందరికీ అభిమానమే.. ప్రతి విషయాన్ని ఆయన ఎంతో పాజిటివ్‌గా తీసుకునేవారట. అందుకే తారకరత్నను కడసారి చూసేందుకు భారీగా తరలి వచ్చారు. తారకరత్నతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, కేంద్రమాజీమంత్రి పురందేశ్వరి సైతం అంతిమయాత్రలో పాల్గొన్నారు. తారకరత్నను ఆసుపత్రిలో చేర్చినప్పటి నుంచి ఇప్పటివరకు అన్నీబాలకృష్ణే దగ్గరుండి చూసుకున్నారు. అంత్యక్రియలు కూడా బాలకృష్ణ సూచనలతోనే నిర్వహించారు.

Untitled-5.jpg

భావోద్వేగానికి లోనైన చంద్రబాబు

మృత్యువుతో 23 రోజులుగా పోరాడిన నందమూరి తారకరత్న(40) శనివారం రాత్రి బెంగళూర్‌లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని బెంగళూర్‌ నుంచి రోడ్డు మార్గంలో రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిల గ్రామంలోని తన నివాసానికి ఆదివారం ఉదయం తీసుకువచ్చారు. తారకరత్నను కడసారి చూసేందుకు బంధువులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, స్థానికులు పెద్దఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు. దాంతో ఆయన నివాసం జన సంద్రమైంది.. ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు, సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేశ్‌, కోడలు బ్రహ్మణీతో కలసి వచ్చి తారకరత్నకు నివాళులర్పించి కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.

Updated Date - 2023-02-20T17:09:22+05:30 IST