లీకేజీపై మౌనం దేనికి?

ABN , First Publish Date - 2023-04-04T02:49:26+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధాన రాజ్యాంగ సంస్థ అయిన టిఎస్‌పిఎస్‌సి ప్రభుత్వ కీలుబొమ్మగా మారింది. స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఈ సంస్థ తన కర్తవ్యాన్ని...

లీకేజీపై మౌనం దేనికి?

తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధాన రాజ్యాంగ సంస్థ అయిన టిఎస్‌పిఎస్‌సి ప్రభుత్వ కీలుబొమ్మగా మారింది. స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఈ సంస్థ తన కర్తవ్యాన్ని గాలికొదిలి, దొర గడీ చుట్టూ తిరుగుతూ తెలంగాణ నిరుద్యోగుల ఆశలను, భవితవ్యాన్ని కలిగిన వాళ్ల కాళ్ల దగ్గర పెట్టింది. తెలంగాణ యువత స్వరాష్ట్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి సాధించుకున్నది గడీలకు రంగులద్దడానికేనా? టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి మీడియా సమావేశంలో జాలి మొఖంతో నమ్మిన వాళ్లే మోసం చేశారని చెప్పడం ఎంత విడ్డూరం?! దోషులను గుర్తిస్తున్నం అంటూ ‘సిట్‌’ అదే ముగ్గురి చుట్టూ కొత్త కథ అల్లి చూపిస్తున్నది. నేటికీ కేసీఆర్ కుటుంబ సభ్యులపైన ఆరోపణలు నిరంతరంగా వెలువడుతున్నప్పటికీ ‘సిట్ అధికారులు’ పట్టించుకోవడం లేదు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ పైన ఉన్న దృష్టి పింకీలకు ఈ ఉద్యమ నేలపైన జరుగుతున్న కువ్వారంపైన లేకపోవడం సిగ్గుచేటు. ‘నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు’ అన్నట్లు ప్రజలు నెత్తీనోరు కొట్టుకుంటున్నా కేసీఆర్ నుంచి కనీసం వ్యాఖ్యానం రాకపోవడం బట్టి చూస్తే తోడు దొంగల తీరును అర్థం చేసుకోవచ్చు. చెదురు మదురు ఘటనలకే మీడియా మీద పడి దండకం చదివే గులాబీ బాసు మీడియా ముందుకు రాలేదంటే నిరుద్యోగ సమస్య తన దృష్టిలో ఏపాటిదో అర్థమవుతుంది. స్వరాష్ట్ర సాధన ఆకాంక్ష అయిన నియామకాలపైన చిత్తశుద్ధి ఎంత ఉందో అర్థమవుతుంది.

ప్రశ్నపత్రాల లీకేజీకి టిఎస్‌పిఎస్‌సి చైర్మన్, కార్యదర్శి, అధికారులందరూ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చెయ్యాలి. టిఎస్‌పిఎస్‌సిని సమూలంగా ప్రక్షాళన చేయాలి. జనార్దన్ రెడ్డి ప్రస్తుత కాలపరిమితిలో ఇచ్చిన నోటిఫికేషన్ల మీద విచారణ జరపాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చెయ్యాలి. సిట్ త్వరితగతిన ప్రభుత్వ జోక్యానికి లొంగకుండా దోషులకు కఠిన శిక్షలు పడేలా చెయ్యాలి. ఇప్పటికే చతికిలపడిన నిరుద్యోగులకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం నగదు సహాయం కింద 30 లక్షల నిరుద్యోగులకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలి. వారికి ఉచిత శిక్షణ అందించాలి. స్పష్టమైన తేదీలు ప్రకటించి ఆ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహించి, ఫలితాలు ప్రకటించాలి. 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలను అర్పించి సాధించిన తెలంగాణ నేడు సిగ్గుపడుతున్నది. నీళ్లు, నిధులు, నియామకాలకై పోరాడిన ప్రతి ఒక్కరు నేడు విచారిస్తున్నారు. కొట్లాడి తెచ్చిన తెలంగాణలో కూడా 200 మందికి పైగా నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

టిఎస్‌పిఎస్‌సిలో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు చర్యలు బలంగా తీసుకోకుంటే ఈ వ్యవస్థపైన విశ్వాసం పూర్తిగా సన్నగిల్లే ప్రమాదం ఉంది. 30 లక్షల మంది నిరుద్యోగులు, కోటిమందిని ప్రభావితం చేసే టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ ఘటన కేసీఆర్‌ను ఇంటికి పంపుతుంది.

సర్దార్ వినోద్ కుమార్

రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం (విజెఎస్)

Updated Date - 2023-04-04T02:49:28+05:30 IST