శంబుక వధ అసలు జరిగిందా?
ABN , First Publish Date - 2023-01-19T00:46:05+05:30 IST
రామాయణంలో శంబుకుని వధ జరిగిందా, లేక ప్రక్షిప్తమా? రామాయణంలో శూద్రుడైన శంబుకుడు తపస్సు చేస్తున్న కారణంగా ఒక బ్రాహ్మణ కుమారుడు...
రామాయణంలో శంబుకుని వధ జరిగిందా, లేక ప్రక్షిప్తమా? రామాయణంలో శూద్రుడైన శంబుకుడు తపస్సు చేస్తున్న కారణంగా ఒక బ్రాహ్మణ కుమారుడు చనిపోయాడని వచ్చిన ఆరోపణలు విశ్వసించి శ్రీరాముడు శంబుకుడిని వధించినట్లు ఒక కథ ఉంది. ఇది మూల వాల్మీకి రామాయణంలో ఉన్నదా, లేదా తరువాత చేర్చబడిందా? అనే విషయాన్ని పరిశీలిద్దాం.
శ్రీరాముడి గురువు వశిష్ఠుడు. వశిష్ఠుడు ఊర్వశి కొడుకు. ఊర్వశి ఇంద్రలోకంలో నర్తకి. వశిష్టుని భార్య అరుంధతి. అరుంధతి మాల. విశ్వామిత్రుడు క్షత్రియుడు. ఆ రోజుల్లో విశ్వామిత్రుడు, వశిష్ఠుడు వారి కులాలతో నిమిత్తం లేకుండా తపస్సు చేసినట్లు మనకు తెలుస్తున్నది. ఇలా తపస్సు చేయడానికి, భగవంతుని ధ్యానించడానికి, జ్ఞాన సముపార్జనకు కులాలు అడ్డు రాలేదని అర్థమవుతుంది. ఇలాంటి చరిత్ర కలిగిన వశిష్ఠుడు శూద్రులు విద్యకు, తపస్సుకు అర్హులు కారని శ్రీరామునికి చెప్పి ఉండడు. వశిష్ఠుడు బోధించిన యోగవాశిష్టం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. యోగవాశిష్ఠంలోని ముముక్షు వ్యవహార ప్రకరణంలోని సర్గ 4లోని 9 నుంచి 19 వరకు ఉన్న శ్లోకాలలో ‘ఏ మానవునికైనా పురుష ప్రయత్నం వలన జ్ఞానము లభించును’ అన్న భావం వ్యక్తమవుతుంది. ఇక రెండో విషయానికొస్తే రామాయణాన్ని రచించింది వాల్మీకి. వాల్మీకి ఒక బోయ కులానికి చెందిన వారని అందరికీ తెలిసిందే. ఆయన తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించుకొని రామాయణాన్ని రచించాడు. అంటే వాల్మీకి కథ కూడా ఏ కులం వాడైనా ఏ జాతివాడైనా జ్ఞానాన్ని సంపాదించవచ్చునని, తపస్సు చేయవచ్చునని తెలుపుచున్నది. అటువంటి వాల్మీకి శంబుకుని కథ రాసి ఉండకపోవచ్చు.
రామాయణ కథను బట్టి రాముడు, విశ్వామిత్రుడు యాగాన్ని సంరక్షించి మిథిలా నగరానికి వెళ్తున్నప్పుడు శబరి అతనికి ఆతిథ్యమిస్తుంది. శబరి మాతంగ మహర్షి ఆశ్రమంలో ఉండేది. మాతంగ మహర్షి తల్లి మాదిగ. అటువంటి మాతంగ మహర్షి ఆశ్రమానికి రాముడు వెళ్లి శబరి ఆతిథ్యం స్వీకరిస్తాడు. శబరి కులం ఏమిటో, మాతంగ మహర్షి కులమేమిటో రాముడు చూడలేదు. మాతంగ మహర్షి కూడా తపస్సు చేసి మహర్షి అయ్యాడు. రామాయణంలోని వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, మాతంగ మహర్షుల కథలను బట్టి ఆనాడు ఎవరైనా యజ్ఞాలు యాగాలు, తపస్సు చేయవచ్చునని విశదం అవుతుంది. రాముడు వనవాసానికి వెళ్లేటప్పుడు బెస్తవాడైన గుహుడు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. గుహుడు ఏ కులం వాడని రాముడు ఆలోచించలేదు. తరువాత రామాయణ కథను బట్టి రాముడు ఆంజనేయుడు, సుగ్రీవుడు మొదలైన వానరుల సహాయం తీసుకున్నాడు. అటువంటి సందర్భంలో వారి జాతి ఏమిటి అని శ్రీరాముడు ఆలోచించ లేదు. ఆంజనేయుడు సకల వేద వేదాంగ పండితుడని రామాయణం చెబుతున్నది. అంటే వానరులు కూడా జ్ఞానానికి అర్హులేనని రామాయణం చెప్తున్నది. అంటే రామాయణ కాలంలో ఏ కులం వారైనా తపస్సు చేయవచ్చునని, వేద విజ్ఞానాన్ని పొందవచ్చని, జ్ఞానానికి భక్తికి ప్రేమకు కులం అడ్డు కాదని తెలుస్తుంది. అటువంటి రాముడు శూద్రుడు తపస్సు చేయడం వల్ల ఒక బ్రాహ్మణ బాలుడు చనిపోయాడని చెపితే నమ్ముతాడా? ఆ మాటలు నమ్మి శంబుకుడిని చంపుతాడా? ఈ వృత్తాంతం మొత్తం ప్రక్షిప్తమని నా అభిప్రాయం.
వాల్మీకి రామాయణంలో ప్రక్షిప్తం జరిగిందనడానికి మరొక ఉదాహరణ: వనవాసానికి వెళ్ళిన రాముడిని తిరిగి అయోధ్యకు తీసుకొని రావడానికి భరతుడు, కౌసల్య, కైకేయి, వశిష్ఠుడు మొదలైన మాన్యులు వెళ్తారు. అందులో చార్వాకుడు కూడా ఉన్నాడని కథ. అంటే దేవుని విశ్వసించని వారు, దేవుని ఉనికిని ప్రశ్నించేవారు ఆ కాలంలో ఉండేవారని, వారిని కూడా గౌరవించేవారని తెలుస్తున్నది. శ్రీరాముని అయోధ్యకు రావాలని చార్వాకుడు కూడా కోరుతాడు. చార్వాకుడు పరలోకం లాంటిది ఏమీ లేదని వాదించాడని, దానికి జవాబుగా శ్రీరాముడు ‘నీవు బుద్ధుని బోధనలు చెబుతున్నావు. బుద్ధుడు ఒక దొంగ’ అన్నాడని అర్థం వచ్చే శ్లోకాలు కొన్నింటిని ప్రక్షిప్తం చేశారు. మహాకవి వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణం అయోధ్యకాండలోని సర్గా 109 లోని 33వ శ్లోకం ఇలా ఉంది: యథాహి చోర సతథాహి బుద్ధ తథాగతం నాస్తిక మంత్ర విద్ది’.
ఈ విషయాన్ని గురించి మేధావులు ఆలోచించాలి. బుద్ధుడు క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల కిందటివాడు. రామాయణం క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల నుంచి 7000 సంవత్సరాల మధ్యలో జరిగినట్లు శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. ‘ఢిల్లీ చాప్టర్ ఆఫ్ ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్’ సంస్థ డైరెక్టరు సరోజ్ బాల ఇలా తెలియచేశాడు: ‘రామాయణం, భారతం జరిగాయనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. రామాయణ కాలం క్రీస్తుపూర్వం 7000 సంవత్సరాల లోపు జరిగిందని అంచనా’. దశావతారాల్లో కూడా రామావతారం, కృష్ణావతారం తర్వాతనే బుద్ధావతారం చూపారు. అంటే రాముని కాలంలో బుద్ధుని బోధనల గురించి, బుద్ధుని గురించి చర్చించే అవకాశం లేదు. ఇలా రామాయణంలో బుద్ధుని విమర్శిస్తూ చెప్పబడిన శ్లోకాలు ప్రక్షిప్తమని స్పష్టంగా తెలుస్తుంది. మేధావులు, రచయితలు, విజ్ఞులు మరింత పరిశోధన చేసి ఈ విషయంలో స్పష్టత కలిగించాలి.
జస్టిస్ బి. చంద్రకుమార్