సర్కారీ సీట్ల అమ్మకం; పాలకులు ఎవరిపక్షం?
ABN , First Publish Date - 2023-08-23T03:27:47+05:30 IST
‘మీరుఇంజనీరింగ్ చదివిస్తారో, డాక్టర్ చదివిస్తారో.. లేదంటే కలెక్టర్ చదివిస్తారో మీ ఇష్టం. మీ పిల్లల్ని చదివించండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఉచితంగా ఉన్నత విద్య అందిస్తాం.’ ఇవీ విపక్ష హోదాలోను...
‘మీరుఇంజనీరింగ్ చదివిస్తారో, డాక్టర్ చదివిస్తారో.. లేదంటే కలెక్టర్ చదివిస్తారో మీ ఇష్టం. మీ పిల్లల్ని చదివించండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఉచితంగా ఉన్నత విద్య అందిస్తాం.’ ఇవీ విపక్ష హోదాలోను, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అన్న మాటలు. కానీ ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లను అమ్ముకుంటున్నారు. ప్రతిభ కలిగిన వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వైద్యవిద్యను దూరం చేస్తున్నారు. మాట్లాడితే పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం అంటున్న ముఖ్యమంత్రి ప్రభుత్వమే తీసుకున్న నిర్ణయం ప్రకారం పేదలకు వైద్య విద్య దూరమవుతూ, ఎంబీబీఎస్ కోసం రూ. కోటి వెచ్చించగలిగిన వారికి మాత్రమే సీటు అందుతోంది. అంటే ఈ ప్రభుత్వం ప్రతిభ కలిగిన పేదల పక్షాన ఉన్నట్టా లేక డాక్టర్ పట్టా కోసం కోటి రూపాయలు ఖర్చు చేయగల పెత్తందారుల ప్రయోజనాల కోసం ఉన్నట్టా?
కొత్తగా ఐదు మెడికల్ కాలేజీల్లో 2023–24 నుంచి ప్రవేశాలకు ఎంసీసీ అనుమతించడంతో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్ల సంఖ్య పెరుగుతుందని, ప్రతిభ ఉన్న వారికి అవకాశాలు పెరుగుతాయని అంతా ఆశించారు. కానీ ఏపీ ప్రభుత్వం అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభించడానికి ఒక్క రోజు ముందు జూలై 19న 107, 108 నెంబర్లతో కొత్త జీవోలు తీసుకొచ్చింది. వాటి ప్రకారం కొత్తగా ప్రారంభిస్తున్న మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల అమ్మకానికి తెరలేపారు. ఆయా కాలేజీల్లో 150 మంది చొప్పున మొత్తం 750 సీట్లకు అనుమతి వచ్చింది. వాటిలో 15 శాతం ఆలిండియా కోటాలో అంటే 113 సీట్లు పోగా మిగిలిన 637 సీట్లను ఏపీలో కన్వీనర్ కోటా ఏ కేటగిరీలో రిజర్వేషన్లను అనుసరించి ప్రతిభ ఉన్న వారితో భర్తీ చేయాల్సి ఉంది. కానీ అనూహ్యంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ప్రస్తుతం జనరల్ కేటగిరీలో కేవలం 50 శాతం అంటే 319 సీట్లు మాత్రమే మిగిల్చారు. 35 శాతం అంటే 223 సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో బీ కేటగిరీ సీట్లుగా మార్చారు. దానికి ఏడాదికి రూ.12 లక్షల చొప్పున ఫీజుగా ప్రకటించారు. మరో 15 శాతం సీట్లను అంటే 95 సీట్లు ఎన్నారై కోటాలో చేర్చారు. ఏడాదికి రూ.20లక్షలు ఫీజుగా జీవోలో పేర్కొన్నారు. అంటే ఎంబీబీఎస్ కోర్సు కోసం బీ కేటగిరీ విద్యార్థి సుమారుగా రూ.60లక్షలు, ఎన్నారై కోటాలో కోటి రూపాయలు చెల్లిస్తేనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు దక్కుతుంది.
కేంద్ర ప్రభుత్వ ఎయిమ్స్ కూడా మంగళగిరిలో అందుబాటులోకి రావడంతో ఏపీలో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటితో పాటుగా 2023–24లో ఏయూ పరిధిలో 20, ఎస్వీయూ పరిధిలో 14, స్టేట్ వైడ్ కాలేజ్గా విజయవాడ సిద్ధార్థ కాలేజ్ను కలుపుకుంటే మొత్తం 35 కాలేజీలకు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. కొత్త కాలేజీలు తీసేస్తే పాత కాలేజీలన్నింటా ఆలిండియా కోటా సీట్లు పోగా మిగిలిన వాటిని మెరిట్ ప్రాతిపదికన కేటాయిస్తున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ ఏడాది ప్రారంభమయ్యే కొత్త ఐదు కాలేజీల్లో మాత్రం మొత్తం సీట్లలో 85 శాతం ప్రతిభ ఉన్న వారికి దక్కాల్సి ఉండగా, కేవలం 42.5 శాతం అంటే సగం సీట్లు మాత్రమే మెరిట్కి దక్కుతున్నాయి. మిగిలిన సీట్లను ప్రభుత్వం అమ్మకానికి పెడుతోంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల మాదిరిగానే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కూడా ప్రతిభకు కాకుండా పైసలున్న వారికే సీటు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సగం సీట్లు ఏ కేటగిరీ అంటే ప్రతిభకు కేటాయిస్తుండగా, కొత్త ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం ప్రైవేటు కాలేజీల కన్నా తక్కువగా మెరిట్ స్టూడెంట్స్కి సీట్లు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ప్రతిభను ఏ విధంగా పాతరేస్తున్నారో అర్థమవుతోంది.
కొత్తగా ప్రారంభమవుతున్న మచిలీపట్నం మెడికల్ కాలేజీలో 150 సీట్లకు గానూ 22 సీట్లు ఆలిండియా కోటాలో పోతే మిగిలిన 128 సీట్లు వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ తరపున కన్వీనర్ కోటాలో ఏ కేటగిరీలో ఉండాలి. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీ–ఎ 7 శాతం, బీసీ–బి 10 శాతం, బీసీ–సి 1 శాతం, బీసీ–డి 7 శాతం, బీసీ–ఇ 4 శాతం కేటాయించాల్సి ఉంది. దానిని అనుసరించి ఎస్సీలకు 20 సీట్లు, ఎస్టీలకు 8 సీట్లు, బీసీ–ఎకి 9 సీట్లు, బీసీ–బికి 13, బీసీ–సికి ఒక్క సీటు, బీసీ–డికి 9, బీసీ–ఇకి 5 సీట్ల వరకూ సుమారుగా దక్కాలి. మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి 64 సీట్లు రావాలి. అవి కాకుండా స్పోర్ట్స్, ఎన్సీసీ, పోలీస్ అమరవీరులు వంటి వివిధ రిజర్వేషన్ కోటాలో కూడా సీట్ల కేటాయింపు ఉంటుంది.
కానీ ప్రస్తుతం జగన్ ప్రభుత్వ నిర్ణయం మూలంగా అదే మచిలీపట్నం మెడికల్ కాలేజీలో ఆలిండియా కోటా పోగా మిగిలిన 128 సీట్లలో 64 సీట్లను బీ, సీ కేటగిరీలుగా మార్చేశారు. వాటికి ఫీజులు నిర్ణయించారు. రిజర్వేషన్లు అమలు చేయబోమంటూ జీవోలో పేర్కొన్నారు. అంటే ప్రభుత్వ విద్యాసంస్థలో రిజర్వేషన్లు తొలగిస్తున్నట్టు ప్రభుత్వమే చెబుతోంది. దాని మూలంగా 64 సీట్లకు మాత్రమే రిజర్వేషన్లు అమలు చేస్తుండడంతో కేవలం 32 సీట్లు మాత్రమే అంటే సగమే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కుతున్నాయి. నిత్యం నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీలు అంటూ మాట్లాడే ముఖ్యమంత్రి హయాంలోనే మొదటిసారి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో రిజర్వేషన్లు మాయమవుతున్నాయి.
కొత్త మెడికల్ కాలేజీల్లో సీట్ల విక్రయానికి తెరలేపిన ప్రభుత్వం దానిని సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అంటూ చెబుతోంది. దేశంలో ఇప్పటివరకూ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతో కొత్త కోర్సులు ప్రారంభించిన చరిత్ర ఉంది. కానీ తొలిసారిగా పాత కోర్సులను కొత్త కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ అంటూ చెప్పడం జగన్ ప్రభుత్వానికే చెల్లింది. ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించే వరకూ కొత్త కోర్సులకు అయ్యే ఖర్చు విద్యార్థుల నుంచి వసూలు చేయడమే సెల్ఫ్ ఫైనాన్స్ విధానం. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు తమ ఘనతగా చెబుతోంది. అంటే ప్రభుత్వమే కాలేజీలు ఏర్పాటు చేసినట్టు అంగీకరిస్తోంది. ప్రభుత్వ కాలేజీల్లో పాత కోర్సులకు కొత్త పేరు పెట్టి సీట్ల విక్రయానికి శ్రీకారం చుట్టడం ప్రభుత్వ తీరుని తేటతెల్లం చేస్తోంది.
మచిలీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే 60 శాతం నిధులు అందిస్తోంది. పిడుగురాళ్ల, అరకులో నిర్మాణంలో ఉన్న కాలేజీలకు కూడా నిధులు కేటాయించినట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రం రూ.585 కోట్లు కేటాయించినట్టు పేర్కొంది. అంటే ప్రభుత్వ నిధులతో నిర్మించిన, ప్రభుత్వ సొమ్ముతో నిర్వహించే కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఏమిటి?
ఈ ఏడాది దేశవ్యాప్తంగా 50 మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతి వచ్చింది. అందులో ఏపీలో 5 కాలేజీలు ఉండగా, తెలంగాణలో 9 ఉన్నాయి. గడిచిన నాలుగేళ్లలోనే తెలంగాణలో 20 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తెచ్చారు. కర్ణాటకలో కూడా గత ఏడాది నాలుగు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చాయి. తమిళనాడులో సైతం కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఏ ఒక్క రాష్ట్రంలోనూ ఇలా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల విక్రయానికి సిద్ధపడిన దాఖలాలు లేవు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ అనగానే దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలులో ఉంటుంది. కేవలం ఏపీలో జగన్ ప్రభుత్వమే మాత్రమే అందుకు విరుద్ధంగా సాగుతోంది.
పాత మెడికల్ కాలేజీల్లో సదుపాయాలు, సిబ్బంది, బోధనాస్పత్రుల్లో అందుబాటులో ఉండే రోగుల సంఖ్య వంటివి మెరుగ్గా ఉంటాయి. కొత్త మెడికల్ కాలేజీల్లో ఇంకా సదుపాయాల ఏర్పాటు కూడా పూర్తి కాలేదు. హాస్టళ్ల నిర్మాణం కూడా పూర్తికాలేదు. అలాంటి చోట్ల భారీగా ఫీజులు నిర్ణయించడమేమిటి? పైగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కూడా రూ. కోటికి పైగా వెచ్చించి వైద్య విద్యను అభ్యసించిన తర్వాత సదరు వ్యక్తి ప్రభుత్వ ఆస్పత్రిలో సేవ చేస్తారా, కార్పొరేట్ ఆస్పత్రిలో వ్యాపారం చేస్తారా? ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయడానికి వైద్యులు రాకపోతే ప్రజారోగ్యం ఏమి కావాలి? ప్రభుత్వ వైద్యరంగాన్ని ఏం చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తోంది? ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటికే విపక్షాలు, వివిధ సంఘాలు తప్పుబట్టాయి. విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు సైతం ఆందోళనకు దిగారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లను అమ్మకం పెట్టాలనే ఆలోచనను వెంటనే విరమించుకోవాలి.
వెన్నెల, మెడికల్ విద్యార్థి