మోదీపై గెలుపు జరిగే పనేనా?
ABN , First Publish Date - 2023-02-03T01:07:04+05:30 IST
రాబోయే సార్వత్రక ఎన్నికల గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు రెండు పరిణామాలను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. అవి : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పరిసమాప్తి...

రాబోయే సార్వత్రక ఎన్నికల గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు రెండు పరిణామాలను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. అవి : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పరిసమాప్తి; నేపాల్లోని సాలిగ్రామ నది నుంచి పవిత్రంగా భావించే రాళ్ళను శ్రీరామ, సీత విగ్రహాల నిర్మాణం కోసం అయోధ్యకు తరలింపు. జోడో యాత్ర ముగింపు సందర్భంగా కశ్మీర్కు మళ్లీ రాష్ట్ర ప్రతిపత్తిని ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. రాజ్యాంగ అధికరణ 370 సహా కశ్మీరుకు సంబంధించిన రాజకీయ అంశాలను తిరగతోడేందుకు కాంగ్రెస్ సుముఖంగా ఉన్నదని రాహుల్ ప్రకటన చెప్పకనే చెప్పింది. అయోధ్యలో రామాలయ నిర్మాణంతో మరోసారి దేశంలో ఎన్నికల వేళ రామనామ జపం దిక్కులు పిక్కటిల్లేలా చేయడం బీజేపీ ప్రయోగించనున్న బ్రహ్మాస్త్రం.
ఎవరెన్ని చెప్పినా ఇవ్వాళ ఎన్నికలు నిర్వహిస్తే నరేంద్ర మోదీ తిరిగి అధికారంలోకి రావటం ఖాయంగా కనిపిస్తోంది. అదానీ ప్రకంపనలు, అధికధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కొలీజియం వివాదం, సిబిఐ, ఈడీ ఇత్యాది దర్యాప్తు వ్యవస్థల దుర్వినియోగం... ఇవన్నీ మోదీ అధికారానికి కళ్ళాలుగా కనపడుతున్నా, వాటిని ముకుతాడుగా ప్రయోగించాల్సిన ప్రతిపక్షం ఇంకా పురిటినొప్పులు పడుతునే ఉంది! భారత్ జోడో యాత్రతో రాహుల్ కాంగ్రెస్ను కదనరంగంలోకి దింపినమాట నిజం. అయితే, ఏయే పార్టీలు, ప్రతిపక్ష నాయకులు సమష్టిగా రాహుల్ నాయకత్వానికి ఒప్పుకుంటారో అర్థంకాని ప్రశ్న. నిన్న మొన్నటిదాకా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీకి తానే బలమైన ప్రత్యర్థినన్నట్టుగా ప్రవర్తించారు. ఇప్పుడేమో గాలిపోయిన బెలూనులా మారిపోయారు. స్వరాష్ట్రంలోనే ఆయనకు పరిస్థితులు అడ్డం తిరుగుతున్నాయి మరి. ఖమ్మంలో కేసీఆర్ ఏర్పాటుచేసిన సభలో ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. సమష్టిగా పనిచేస్తాం అనే సంకేతం ఇచ్చారా? లేదు. ఇవ్వలేకపోతే మోదీని ఎలా ఎదుర్కోగలరు?
రాహుల్ గాంధీ జోడో యాత్ర సమాప్తి సందర్భంగా దాదాపు 24 ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించినా అరడజనుపార్టీలు కూడా రాలేదట! రాహుల్ని సమష్టి నాయకుడిగా ఒప్పుకోవటానికి ప్రతిపక్షాలు అన్నీ సిద్ధంగా లేవన్నది స్పష్టం. స్టాలిన్, ఉద్ధవ్ థాక్రే లాంటి కొందరు నాయకులు కాంగ్రెస్తో జతకట్టే అవకాశం ఉన్నా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం తన ఒకనాటి మాతృసంస్థకు దూరంగానే ఉండిపోతున్నారు. ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ ఎటూ మొగ్గటం లేదు. జగన్ సింగిల్గా ఉండే దాఖలాలే కనపడుతున్నాయి. పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్తో కలిసి అధికారాన్ని హస్తగతం చేసుకొనే పనిలో ఉండటం వల్లనేమో జాతీయ స్థాయిలో ఎవరితోనూ అంటకాగటం లేదు. దేశంలో జాతీయ స్థాయిలో ప్రతిపక్షకూటమి ఏర్పడి మోదీ అధికారాన్ని సవాలు చేసే పరిస్థితి కనుచూపుమేరలో లేదు. అభిజాత్యాలు పక్కనపెట్టి, మమత, కేజ్రీవాల్, రాహుల్, నితీశ్, అఖిలేశ్, మాయావతి, స్టాలిన్, ఉద్ధవ్, శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లా లాంటి నాయకులంతా ఏకమై, కమ్యూనిస్టులను గూడా కలుపుకొని పోయి ఎమర్జెన్సీ అనంతర జనతా పార్టీ తరహాలో ఒక ఫ్రంట్ ఏర్పడి కామన్ ఎజెండాతో పురోగమిస్తేనే మోదీని కట్టడి చేయటం సాధ్యం. కానీ అది జరిగే పనేనా?
రావులపాటి సీతారాంరావు