‘ఫోర్జరీ’కి నిన్హైడ్రిన్ టెస్ట్తో చెక్!
ABN , First Publish Date - 2023-08-02T01:04:54+05:30 IST
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా భూదందాలు, భూ కబ్జాలు పెరిగిపోతున్నాయి. వేల ఎకరాల ప్రైవేట్, ప్రభుత్వ భూములు, స్థిరాస్తులు బలవంతంగా, నకిలీ డాక్యుమెంట్లతో కొందరు...
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా భూదందాలు, భూ కబ్జాలు పెరిగిపోతున్నాయి. వేల ఎకరాల ప్రైవేట్, ప్రభుత్వ భూములు, స్థిరాస్తులు బలవంతంగా, నకిలీ డాక్యుమెంట్లతో కొందరు ఆక్రమించుకుంటున్నారు. భూ వివాదాలలో కోర్టులో కేసులు సంవత్సరాలు, దశాబ్దాలే కాక, తరాల పాటు కొనసాగుతుండడం వల్ల అసలైన భూ యజమానులు ఆక్రమణదారులతో ఏదో విధంగా రాజీపడే దుస్థితి ఏర్పడుతోంది. ఈ సెటిల్మెంట్లు కొందరు రాజకీయ నాయకులకు ముఖ్య ఆదాయవనరుగా మారిపోయింది. ప్రస్తుతం అక్రమాలను అరికట్టడానికి సిసి కెమెరాలు, నకిలీ డాక్యుమెంట్లను గుర్తించడానికి ఎన్నో ఆధునిక సాంకేతిక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే మాజీ ఎంపీ, దివంగత వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి ఆయన రాసినట్లుగా ప్రదర్శించిన మరణ వాంగ్మూలం లేఖ నకిలీదని గుర్తించడంలో కేంద్ర ఫోరెన్సిక్ కేంద్రం నిర్వహించిన నిన్హైడ్రిన్ టెస్టు అత్యంత కీలక పాత్ర వహించింది. ఇలాంటి టెస్ట్ ఒకటి మన దేశంలో అందుబాటులో ఉన్నట్లు చాలా మందికి తెలియదు. ఈ టెస్టు వల్ల అసలు డాక్యుమెంటు పేపరు ధ్వంసమైనప్పటికీ అంతకుముందే ధృవీకరించిన కాపీ ద్వారా లేదా రిజిస్ట్రార్ కార్యాలయ రికార్డుల నుంచి మరో కాపీని తయారుచేయడం ఏ మాత్రం సమస్య కాబోదు. నిన్హైడ్రిన్ టెస్టు జరిపి తమ ఆస్తులకు భద్రత కల్పించాలనే బాధితుల అభ్యర్థనను న్యాయస్థానాలు అంగీకరించాలి. అవసరమైతే అందుకయ్యే ఖర్చును పిటిషనర్ల నుంచి వసూలు చేయవచ్చు. పాత రికార్డులలో ఉన్న వేలిముద్రలతో ఈ డాక్యుమెంట్ల మీద ఉన్న వేలిముద్రలను సరిచూసుకుని నకిలీ డాక్యుమెంట్లను గుర్తించాలి. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని క్రిమినల్స్గా పరిగణించి కఠినంగా శిక్షించాలి.
డా. యంవిజి అహోబలరావు