ఉద్యమాల గుమ్మంలో బీఆర్‌ఎస్ తొలి నగారా!

ABN , First Publish Date - 2023-01-18T23:33:34+05:30 IST

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకున్న ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్...

ఉద్యమాల గుమ్మంలో బీఆర్‌ఎస్ తొలి నగారా!

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకున్న ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 18న ఖమ్మం పట్టణానికి రానున్నారు. అదే రోజున, దశాబ్దాల తరబడి రాజకీయ చైతన్యానికి ప్రతీకగా పేరెన్నికగన్న ఖమ్మం పట్టణంలో, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ తరుణంలో జిల్లాకు చెందిన వ్యక్తిగా గత అరవై డెబ్బై ఏళ్ల ఖమ్మం చరిత్రను, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఖమ్మం సాధించిన అభివృద్ధిని, మరెన్నో రాజకీయ రాజకీయేతర స్మృతులను మననం చేసుకోవాలనిపించింది.

ఖమ్మం పట్టణం మధ్యలో ఉన్న స్తంబాద్రి లక్ష్మీ(నృ)నరసింహస్వామి పేరు మీద స్తంబాద్రిగా వెలసింది ఖమ్మం. స్తంభాన్ని ఉర్దూలో ఖంబా అంటారు. రంగారెడ్డి, లఖ్నారెడ్డి, వేమారెడ్డి అనే ముగ్గురు సోదరులు ఓరుగల్లు నుంచి అపారమైన గుప్తనిధిని తీసుకుని ఈ ప్రాంతానికి వచ్చి ఖమ్మం ఖిల్లాను, లఖ్నవరం చెరువును నిర్మించారని అంటారు. పౌరాణిక గాథల ఆధారంగా, కృతయుగంలో సాలగ్రామాద్రి అని, త్రేతాయుగంలో నరహరిగిరి అని, ద్వాపరయుగంలో స్తంబశిఖరి అని, కలియుగంలో స్తంబాద్రి అని పిలిచేవారట. అందుకే ఖమ్మంకు ఆ పేరొచ్చింది.

మొదటి సాలార్జంగ్ ప్రధాని కాగానే 1865లో పరిపాలనా వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఖమ్మం ఆ రోజుల్లోనే జిల్లా కేంద్రంగా ఉండేది. ఇప్పటి వరంగల్ ఆనాడు ఖమ్మం జిల్లాలో ఒక తాలూకాగా మాత్రమే ఉండేది. 20వ శతాబ్దం ఆరంభం నాటికి ఖమ్మం జిల్లా మారి వరంగల్ జిల్లాగా ఏర్పడ్డది. వరంగల్ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న ఖమ్మం, అక్టోబరు 1, 1953న తిరిగి కొత్త జిల్లాగా ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లాను ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంగా రెండు జిల్లాలుగా విభజించారు. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి, రాజకీయ చైతన్యానికి, ప్రగతికి, విద్యా వ్యాప్తికి, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ రంగాలకు, వైజ్ఞానిక స్ఫూర్తికి ఖమ్మం ఒక పర్యాయపదం అంటే అతిశయోక్తి కాదేమో!

చిర్రావూరి లక్ష్మీనరసయ్య, సర్వదేవభట్ల రామనాథం, మంచికంటి రామకిషన్‌రావు, రావెళ్ళ సత్యనారాయణ, కెఎల్ నరసింహారావు, బోడేపూడి వెంకటేశ్వరరావు, నల్లమల గిరిప్రసాద్, టీబీ విఠల్ రావు, పువ్వాడ నాగేశ్వరరావు, మహమ్మద్ రజబ్ అలీ, పర్సా సత్యనారాయణ వంటి కమ్యూనిస్టు పార్టీ యోధానయోధులను అందించిన జిల్లా అది. మధిర ఎమ్మెల్యేగా రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషించిన బొమ్మకంటి సత్యనారాయణరావు ఖమ్మం జిల్లావాడే. బహుభాషావేత్త, సాంఘిక సంస్కర్త, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వికాసానికి నిరంతరం కృషి చేసిన ప్రముఖుడు మాడపాటి హనుమంతరావు మధిర తాలూకా ఎర్రుపాలెంలో జన్మించారు. మాడపాటి రామచంద్రరావు ఈ జిల్లావాడే. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, మాజీ మంత్రి శీలం సిద్దారెడ్డి ఖమ్మం జిల్లావారే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత మొదటి దఫా మంత్రివర్గంలో పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు, రెండవ దఫా మంత్రివర్గంలో పనిచేస్తున్న పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లావారే. ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవారే. దేశచరిత్రలోనే పౌరహక్కుల ఉద్యమాలకు నాంది పలికిన మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, అడ్వకేట్‌ రాధాకృష్ణ, అడ్వకేట్ సుబ్బారావులు ఖమ్మం జిల్లాలో స్థిరపడినవారే.

తెలంగాణ సర్దారుగా పేరొందిన సర్దార్ జమలాపురం కేశవరావు ఈ జిల్లావాడే. ఖమ్మంలో జన్మించిన హీరాలాల్ మోరియా పూర్వికులెప్పుడో ఉత్తరాది నుండి వచ్చి ఇక్కడ స్థిరపడినారు. హీరాలాల్ క్విట్ ఇండియా ఉద్యమంలో, నిజాం వ్యతిరేక ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. మాతృభాష తెలుగు కాకపోయినా తెలుగు భాషపై మమకారంతో రచనలు చేశారు. సహచర కవులైన దాశరథి, కవి రాజమూర్తి, కొలిపాక మధుసూదనరావు లాంటివారితో కలిసి స్వాతంత్ర్య ఉద్యమంలో పనిచేశారు. కమ్యూనిస్ట్ రైతాంగ ఉద్యమానికి సమాంతరంగా సరిహద్దు పోరాట క్యాంపులను సమర్థంగా నడిపి, మొట్టమొదటిసారిగా జాతీయ జెండాను జయంతి గ్రామంలో పోలీసు చర్యకు ఆరంభంగా దారిచూపిన మహానుభావుడు, సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఆర్య సమాజ దీక్ష తీసుకున్న పండిత రుద్రదేవ్ ఖమ్మం జిల్లా బీరవోలు గ్రామస్థుడు. రజాకార్ల దౌష్ట్యానికి బలైపోయిన ప్రముఖ పత్రికా సంపాదకుడు షోయబుల్లా ఖాన్ ఈ జిల్లాకు చెందిన సుబ్లేడులో జన్మించాడు.

‘నా తెలంగాణ కోటి రతణాల వీణ’ అన్న ఖమ్మం జిల్లాకు చెందిన దాశరధి కృష్ణమాచారి జైలు శిక్ష అనుభవిస్తూ, ‘ముసలి నక్కకు దక్కునే రాజ్యము’ అని బొగ్గుతో జైలు గోడల మీద కవిత్వం రాశాడు. ఆయన రాసిన అగ్నిధార, రుద్రవీణ కవితలలోని పలు మాటలు సామాన్య ప్రజానీకానికి నినాదాలు అయ్యాయి. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తన రచనలు, పాటల ద్వారా ప్రజలను చైతన్య పరిచి, తెలంగాణ గీతకర్త రావెళ్ళ వెంకట రామారావు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లి వాసి. తెలుగు సినిమా ప్రంపంచానికి, నాటక రంగానికి పాటలు రాసిన మొట్టమొదటి కవి చందాల కేశవదాసు ఖమ్మం జిల్లాకు చెందిన జక్కేపల్లిలో జన్మించాడు.

1968లో తెలంగాణ ప్రజా పోరాటానికి ‘రక్షణల ఉద్యమం’ పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచ థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రంలో అంకురార్పణ జరిగింది. ఐదు దశాబ్దాల క్రితం ఆరంభమైన అలనాటి ‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన విద్యార్థి ఉద్యమం’ బీజమే ఇంతింతై వటుడింతై అన్న చందాన ఒక వటవృక్షమైంది. ఆ పోరాటమే చిలికి చిలికి గాలివానగా మారి, జిల్లా అంతటా పాకి, ఖమ్మం పట్టణం చేరుకుంది. ఖమ్మం స్థానిక కళాశాలలో చదువుకుంటున్న రవీంద్రనాథ్ అనే విద్యార్థి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటూ ‘గాంధీ చౌక్’లోని గాంధీ విగ్రహం దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. చివరకు కేసీఆర్ సారథ్యంలోని మలివిడత ఉద్యమం కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు దారితీసింది. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 29 నవంబర్ 2009న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కేసీఆర్ కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేట దగ్గర రంగధాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షాస్థలి వద్దకు బయలుదేరిన తరువాత, ఆయన వాహనాన్ని ముట్టడించిన ఉమ్మడి అంధ్రప్రదేశ్ పోలీసులు, నిరాహార దీక్షాస్థలి వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆయనను వాహనం నుండి దింపేశారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసిన కేసీఆర్‌ను ఖమ్మం జైలుకు తరలించారు. ఖమ్మం జైలులోనే కేసీఆర్ తన దీక్షను ప్రారంభించారు. దరిమిలా తెలంగాణ ఏర్పాటు ప్రకటన రావడం, మరో ఐదేళ్లకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడం వర్తమాన చరిత్ర. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఖమ్మం ప్రాంతానిది కీలక పాత్ర.

గత ఎనిమిదిన్నరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఖమ్మం జిల్లాలో, ఖమ్మం పట్టణంలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని అభివృద్ధి జరిగింది. ఈ నేపథ్యంలో, ఉద్యమాల గుమ్మంగా, తొలిదశ తెలంగాణ ఉద్యమ ఆరంభ వేదికగా, యావత్ తెలంగాణకు, దేశానికి కూడా తెలిసిన ఖమ్మం నుంచే భారత్ రాష్ట్ర సమితి నిర్వహించే మొట్టమొదటి భారీ బహిరంగ సభ జరగనుంది. జాతీయపార్టీ బీఆర్‌ఎస్‌ ఎజెండాను ఈ సభ ద్వారా ప్రజలకు వివరించే అవకాశాలు మెండుగా ఉంది. దేశ రాజకీయాల దిశానిర్దేశం ఖమ్మం నుండే జరగనుండడం గర్వకారణం.

వనం జ్వాలా నరసింహారావు

(నేడు ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ)

Updated Date - 2023-01-18T23:33:35+05:30 IST