Share News

ఆంధ్రోద్యమ పురిటిగడ్డ బాపట్ల

ABN , First Publish Date - 2023-11-01T00:54:41+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ అవతరణలో బాపట్ల అద్వితీయమైన పాత్రను పోషించింది. ఆంధ్రోద్యమానికి బాపట్లలోనే బీజం పడింది. 1918 మే 26న బాపట్ల టౌన్‌హాల్‌లో...

ఆంధ్రోద్యమ పురిటిగడ్డ బాపట్ల

ఆంధ్రప్రదేశ్‌ అవతరణలో బాపట్ల అద్వితీయమైన పాత్రను పోషించింది. ఆంధ్రోద్యమానికి బాపట్లలోనే బీజం పడింది. 1918 మే 26న బాపట్ల టౌన్‌హాల్‌లో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు పునాది అయింది. తెలుగువారి ఐక్యతకు ఇది ఊతమిచ్చింది. నాలుగు దశాబ్దాల ఆంధ్రోద్యమానికి నాంది పలికింది.

ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం బాపట్ల ప్రాంతానికి చెందిన స్వామి సీతారాం 1951లోనే 85 రోజులపాటు ఆమరణ నిరాహారదీక్ష చేశారు. ఆచార్య వినోబాభావే జోక్యంతో విరమించుకొన్నారు. భాషాప్రయుక్త రాష్ట్ర వాదనకు కూడ బాపట్లలోనే అంకురార్పణ జరిగింది. తెలుగువారి గొప్పదనాన్ని, చరిత్రను తెలియచెప్పి బాపట్ల మహాకవి రాయప్రోలు సుబ్బారావు ప్రజల్లో ఆంధ్రోద్యమ స్ఫూర్తిని రగిల్చారు. తెలుగుతల్లి భావనకు రాయప్రోలు జీవం పోసి, బాపట్లను తెలుగుతల్లికి పుట్టినిల్లుగ తీర్చిదిద్దారు. తెలుగు భాషామతల్లి కంఠంలో మల్లెదండ వేశారు. తన రచనల ద్వారా తెలుగు వారిలో ఐక్యతను పెంపొందించారు. మరో బాపట్ల కవి తుమ్మల సీతారామ్మూర్తి రాష్ట్ర గానాన్ని ఆలపించారు. ప్రజలను జాగృతపరిచారు. రాష్ట్రసిద్ధి కొరకు రక్తముగార్చిన కవిని నేను అని సగర్వంగా ప్రకటించుకొన్నారు. తెలుగుకు కావ్యభాష హాదా కల్పించి, సౌరస్వత గౌరవాన్ని అందించిన ఘనత బాపట్లదే. తెలుగు సాహిత్యం బాపట్లలోనే ఓనమాలు దిద్దుకుంది. బాపట్ల తొలి శాసనసభ్యుడు వేములపల్లి శ్రీకృష్ణ ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’ అని నినదించి ప్రజలను చైతన్యపరిచారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణలో బాపట్ల పాత్ర బహుముఖమైనది. తుదకు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో 1953 అక్టోబరు 1న తెలుగు వారికి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం సిద్ధించింది. 1956 నవంబరు 1న తెలంగాణా ప్రాంతాలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ అవతరించింది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం బాపట్ల టౌన్‌హాల్‌లో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి.

డా. పి.సి. సాయిబాబు

Updated Date - 2023-11-01T00:54:41+05:30 IST