Divinity : అలా స్పందించడమే దివ్యత్వం

ABN , First Publish Date - 2022-12-08T23:55:03+05:30 IST

సమాజ రక్షణ కోసం మానవుల మధ్య మహాత్ములు ఎందరో అవతరించారు. ఆ సమాజ పరిస్థితిని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని అనుససరించారు. తమ ఆచరణాత్మకమైన

Divinity : అలా స్పందించడమే దివ్యత్వం

సమాజ రక్షణ కోసం మానవుల మధ్య మహాత్ములు ఎందరో అవతరించారు. ఆ సమాజ పరిస్థితిని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని అనుససరించారు. తమ ఆచరణాత్మకమైన ప్రబోధాలతో సామాజిక జీవితాన్ని ప్రభావితం చేశారు. తమ సందేశం ద్వారా ఎందరికో వెలుగు దారి చూపించారు. అటువంటి వారిలో... సృష్టి చరిత్రలోనే ఏ విధమైన భేదాలు లేకుండా అందరినీ తన బిడ్డలుగా దర్శించి, ప్రేమించి, లాలించిన అపూర్వ ప్రేమమూర్తి జిల్లెళ్ళమూడి అమ్మ. ఆమె నడయాడిన గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని జిల్లెళ్ళమూడి... ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగా మారి ప్రసిద్ధి చెందింది. జిల్లెళ్ళమూడి అనగానే ప్రత్యేకంగా కనిపించేది తల్లీ బిడ్డల బంధం. ‘అందరూ నా బిడ్డలే’ అనే భావమే అమ్మ ప్రత్యేకత. ఎందరెందరికో తన మాతృ ప్రేమను, అవ్యాజ కారుణ్యాన్ని, అమృత తుల్యమైన వాత్సల్యాన్ని ఆమె పంచారు. తన నివాసాన్ని వర్గాలు లేని స్వర్గంగా... సమ సమాజానికి నమూనాగా రూపొందించి, అందరికీ ఆరాధ్యమూర్తి అయ్యారు.

అమ్మ సన్నిధిలో లౌకికానికి, ఆధ్యాత్మికానికీ సుందర సమన్వయం గోచరమవుతుంది. ‘ప్రజా సేవ కూడా మోక్ష మార్గమే’ అనే అమ్మ సందేశం అక్కడి ఆవరణలో అడుగడుగునా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ‘సామాజిక భావన లేని ఆధ్యాత్మికత... రేవు లేని కాలువ లాంటిది’ అంటూ... ‘లౌకిక జీవితంలో మంచి పద్ధతులు పాటించడమే ఆధ్యాత్మికత’ అనే వినూత్న ప్రబోధాన్ని అమ్మ అందించారు. ‘‘మానవుణ్ణి ఉద్ధరించడానికే నా రాక’’ అని ఆమె ప్రకటించారు. ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో మానవత్వపు విలువలకు పట్టు కొమ్మలైన విషయాలన్నింటినీ ఆచరణాత్మకంగా ఆమె ఉపదేశించారు. మానవీయ విలువలకు మకుటాయమానంగా నిలిచారు. ‘ప్రపంచంలోని మానవులంతా ఒక్కటే. అందరికీ సమాన అవకాశాలు, కనీస అవసరాలైన కూడు, నీడ ఏర్పడాలి, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి. దీనికి ఏ భేదాలు అడ్డు కాకూడదు’ అనేది మానవతావాదం. దాన్ని ఆమె అక్షరాలా ఆచరించి చూపారు.

ఆపన్నుల కోసం ఆహార పదార్థాలను తయారు చేయించి, వారి వద్దకు వెళ్ళి, దగ్గరకు తీసుకొని, ఆహారం తినిపించి, ధోవతులు పంచి... వారి కష్టాలను విని, ఓదార్చిన సందర్భాలు ఎన్నెన్నో. ‘కష్టాలలో ఉన్న అభాగ్యుల బాధలకు స్పందించడమే మానవుని ద్వారా వ్యక్తమయ్యే దివ్యత్వం’ అని అమ్మ నిర్వచించారు. కొంతమంది భక్తులు ‘‘తరించడానికి సులువైన మార్గం ఏదన్నా చెప్పమ్మా’’ అని అమ్మను అడిగితే... ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడం కన్నా తరించే సులువైన మార్గం ఏముంది?’’ అని ఆమె బదులిచ్చారు.

డాక్టర్‌ బి.యల్‌.సుగుణ

Updated Date - 2022-12-08T23:55:04+05:30 IST