నేడు ‘తుడుందెబ్బ’ బహిరంగసభ!

ABN , First Publish Date - 2022-12-09T00:41:40+05:30 IST

ఆంధ్రావలసవాదులు దొంగలనీ, స్థానికులకు దక్కాల్సినవన్నీ దోచుకుంటున్నారని ఉద్యమించి సాధించుకున్న స్వరాష్ట్రంలో ఆదివాసీలకు అన్యాయమే జరుగుతోంది...

నేడు ‘తుడుందెబ్బ’ బహిరంగసభ!

ఆంధ్రావలసవాదులు దొంగలనీ, స్థానికులకు దక్కాల్సినవన్నీ దోచుకుంటున్నారని ఉద్యమించి సాధించుకున్న స్వరాష్ట్రంలో ఆదివాసీలకు అన్యాయమే జరుగుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీసీ, ఎస్సీ, ఓసీలుగా ఉన్న లంబాడాలు లక్షలాదిగా ఇక్కడకు తరలివచ్చి ఆదివాసీల రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ అవకాశాలు దోచుకుంటుంటే పాలకులు నోరువిప్పడం లేదు. ఒకే రాష్ట్రంలో ఉన్న ఆంధ్రావి వలసలైతే ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన లంబాడీలవి వలసలు కావా? ఒక్క ఆదివాసీ కూడా ఐఎఎస్, ఐపీఎస్ కాకున్నా, లంబాడాలు మాత్రం డెబ్బయ్ మంది ఉన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల్లోనూ 95శాతం వారే. యూనివర్సిటీల్లోని ప్రొఫెసర్ ఉద్యోగాలన్నీ వీరివే. మెడికల్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ తదితర సీట్లన్నీ లంబాడీలు దక్కించుకుంటున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో, గురుకులాల్లో, కళాశాలల్లో వారే నిండిపోయారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పదిహేను డిగ్రీ గురుకులాలు లంబాడా ప్రాంతాల్లోనే ఏర్పాటైనాయి. సర్పంచ్ నుంచి గిరిజనశాఖామంత్రి వరకూ, టీఎస్ పీఎస్సీ నుంచి పార్లమెంటరీ కమిటీ సభ్యులవరకూ ప్రభుత్వం లంబాడాలనే నియమించింది. అక్రమంగా షెడ్యూల్డ్ ఏరియాల్లోకి వలసవచ్చిన లంబాడాలు తమ ఆర్థిక రాజకీయబలంతో ఆదివాసీ ప్రాంతాల్లోని ఉద్యోగాలన్నీ దోచుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం వారినే ముద్దాడుతూ అన్నింటినీ దోచిపెడుతున్నది. ఆదివాసీలు అన్నిరకాలుగా అన్యాయమైపోతున్న ఈ నేపథ్యంలో, లంబాడాలను ఎస్టీ జాబితానుంచి తొలగించడం, జీవో 3ను యధావిధిగా అమలు చేయడం, ప్రత్యేక డీఎస్సీతో ఆదివాసీ యువతీయువకులకు ఉద్యోగాలు కల్పించడం వంటి అనేక డిమాండ్లతో నేడు ఇంద్రవెల్లిలో ‘తుడుందెబ్బ’ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ జరుగుతున్నది.

వూకే రామకృష్ణ దొర

Updated Date - 2022-12-09T00:41:55+05:30 IST