Share News

హరీశ్‌రావు కాదు.. హౌలేశ్‌రావు

ABN , Publish Date - Apr 27 , 2024 | 05:48 AM

‘రాష్ట్ర రాజకీయాల్లో హరీశ్‌రావు ఓ జోకర్‌గా మారారు. ఆయన పేరు హరీశ్‌రావు కాదు ‘హౌలేశ్‌ రావు’. అధికారం పోయిన తరువాత మతిభ్రమించి అన్నీ హౌలే పనులు చేస్తున్నాడు. రాజకీయాల్లో ఆయనొక జోకర్‌’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

హరీశ్‌రావు కాదు.. హౌలేశ్‌రావు

రాజకీయాల్లో ఆయనొక జోకర్‌.. ఉద్యమ సమయంలో ‘అగ్గిపెట్టె’ డ్రామా

ఇప్పుడు డూప్లికేట్‌ రాజీనామా డ్రామా

  • రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో నిలుస్తాం: మంత్రి కోమటిరెడ్డి

  • హరీశ్‌.. రాజీనామాకు

  • సిద్ధంగా ఉండు: కొండా సురేఖ

  • బీజేపీలో చేరేందుకే హరీశ్‌

  • రాజీనామా డ్రామా: రాజగోపాల్‌రెడ్డి

    హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి)/జగదేవ్‌పూర్‌/భూదాన్‌పోచంపల్లి, ఏప్రిల్‌ 26: ‘ ఆగస్టు 15 వరకు రైతుల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటిస్తే.. ఆ ఒక్క హామీ నెరవేర్చడం కాదని, మొత్తం 13 హామీలను తీర్చాలని మాట మార్చారని విమర్శించారు. ఓ డూప్లికేట్‌ రాజీనామా పత్రాన్ని పట్టుకుని అమరుల స్తూపం దగ్గర డ్రామా చేస్తున్నాడని ధ్వజమెత్తారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డితో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. ఉద్యమ సమయంలో పెట్రోల్‌ పోసుకుని అగ్గిపెట్టె దొరకలేదని హరీశ్‌ డ్రామాలాడాడని, ఇపుడు రాజీనామా పేరుతో మరో డ్రామాకు దిగాడని.. అప్పటి నాటకానికి, ఇప్పటి నాటకానికి ఏం తేడా లేదని మండిపడ్డారు.


రాజీనామా చేస్తే ఎవరైనా స్పీకర్‌ ఫార్మాట్‌లో ఒకే లైన్‌లో చేస్తారని.. హరీశ్‌ మాత్రంం పేజీన్నర లేఖ రాసి రాజీనామా చేశానంటూ డ్రామాలాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్‌ డ్రామాలు బంద్‌చేసి అక్రమంగా సంపాదించిన సొమ్ముతో దుబాయ్‌ లేదంటే ఇంకెక్కడికైనా వెళ్లి బతికితే మంచిదని సూచించారు. దళితులని సీఎం చేస్తానని మాట తప్పిన, పదేండ్లలో 100 రోజులు కూడా సచివాలయానికి రాని తన మామ(కేసీఆర్‌)ను.. ప్రశ్నించి ఉంటే బాగుండేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడే 9 ఎంపీ సీట్లు గెలిచిన బీఆర్‌ఎస్‌ ఇప్పుడు 8 నుంచి 12 సీట్లు గెలుస్తుందంటూ కేసీఆర్‌ మాట్లాడుతున్నారని, ఆయన అలా అంటున్నారంటే.. ఈవీఎంలను రిగ్గింగ్‌ చేయిస్తారేమోననే అనుమానం కలుగుతోందన్నారు. జూన్‌ 3 తరువాత రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పూర్తిగా మూతపడుతుందని జోస్యం చెప్పారు. ఇప్పటి వరకు తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని అమలు చేశామని, మరో గ్యారెంటీని కూడా అమలుచేస్తామని స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటామని చెప్పారు. ‘‘రుణమాఫీ అనేది కాంగ్రెస్‌ బాండ్‌. కాంగ్రెస్‌ హయాంలో దేశంలో రూ.70వేల కోట్ల పైచిలుకు రుణమాఫీ చేశాం.


రుణమాఫీ సమయంలో అప్పటికే చెల్లించిన వారికి రూ.5-10వేల వరకు ప్రోత్సాహాన్ని కూడా అందించాం’’ అని మంత్రి కోమటిరెడ్డి గురు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ హామీని కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేరుస్తుందని, హరీశ్‌రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దౌలాపూర్‌లో మెదక్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధుతో కలిసి ఆమె మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతు, ప్రజా సమస్యలు లేవనెత్తకుండా సమావేశాలు ముగిసే వరకు ఫామ్‌హౌజ్‌లో ఉన్న కేసీఆర్‌ దొడ్డిదారిన వెళ్లి రైతులను కలిసి అపోహలు సృష్టిస్తున్నారన్నారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్‌లు ఎత్తివే యాలని చూస్తోందని ఆరోపించారు. పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌ అవుతుందని, బీజేపీలో చేరేందుకే హరీశ్‌ రాజీనామా డ్రామా ఆడుతున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీ, కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. గతంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్‌ ప్రకటించారని, లేనిపక్షంలో తల నరుక్కుంటా అన్నారని, ఇప్పుడు హరీశ్‌ రావు మామ తల నరికి ప్రజల్లోకి రావాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని, అవినీతి బీఆర్‌ఎ్‌సలను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.

Updated Date - Apr 27 , 2024 | 05:48 AM