Share News

Air India Express: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 25 మంది తొలగింపు

ABN , Publish Date - May 10 , 2024 | 04:46 AM

మూకుమ్మడి సెలవులు పెట్టిన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ క్రమశిక్షణ చర్యలు ప్రారంభించింది. సాయంత్రానికి ఉద్యోగులు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

Air India Express: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 25 మంది తొలగింపు

  • మూకుమ్మడి సెలవుల ఫలితం

  • మిగతా వారికి అల్టిమేటం జారీ

  • సాయంత్రానికి సమ్మె విరమణ

  • ఉద్యోగుల తొలగింపు నిర్ణయం వెనక్కి

న్యూఢిల్లీ, మే9: మూకుమ్మడి సెలవులు పెట్టిన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ క్రమశిక్షణ చర్యలు ప్రారంభించింది. సాయంత్రానికి ఉద్యోగులు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. బుధవారం సుమారు 300మంది ఒక్కసారిగా సిక్‌లీవ్‌లు పెట్టడంతో ఎయిరిండియా ఎక్స్‌ప్రె్‌స 90 విమానాలు రద్దయ్యాయి. ఇలా సెలవులు పెట్టిన వారిలో 25 మందిని గురువారం ఉదయం విధుల్లోంచి తొలగించింది. మిగతావారికి ‘‘4గంటల్లోగా విధుల్లో చేరకుంటే తీవ్ర పరిణామాలుంటాయి’’ అంటూ అల్టిమేటం జారీ చేసింది. ‘‘మీ చర్య ఉద్దేశపూర్వకమేనని స్పష్టమవుతోంది.


మీ చర్య వల్ల వేల మంది ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. భారీ ఆర్థికనష్టం వాటిల్లింది’’ అంటూ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్స్‌లోస్పష్టంచేసింది. గురువారం 20రూట్లలో రెగ్యులర్‌ సర్వీసులు పునరుద్ధరించామని, 283విమానాలు నడిపామని ఎయిరిండి యా ఎక్స్‌ప్రెస్‌ తెలిపింది. అయితే రెండో రోజూ 85 విమానాలు రద్దుకావడం గమనార్హం..! కాగా తొలగించిన ఉద్యోగుల తరఫున సంస్థ యాజమాన్యంతో మాట్లాడడానికి మధ్యవర్తిత్వం జరుపుతామని ఆ సంస్థ ఉద్యోగుల సంఘం ఏఐఎక్స్‌ఈయూ పేర్కొం ది. ఎయిరిండియా మాత్రం తామెలాంటి సంఘాన్ని గుర్తించడంలేదని తేల్చిచెప్పింది.


దీంతో ఢిల్లీలోని రీజినల్‌ లేబర్‌ కమిషనర్‌ అశోక్‌ పెరుమల్ల రంగంలోకి దిగారని, ఉద్యోగులపట్ల ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ తీరును ఆయన తప్పుబడుతూ ఓ ఈ-మెయిల్‌ పంపినట్లు సమాచారం. ఉ ద్యోగుల సమస్యలను గుర్తించేందుకు ఒక ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారని, సంస్థ హెచ్‌ఆర్‌ అధికారులతో మాట్లాడాక వివక్ష, ప్యాకేజీల్లో తేడాలు నిజమేనని తేలినట్లు పెరుమల్ల పేర్కొన్నట్లు ఎన్‌డీటీవీ కథనం స్పష్టంచేస్తోంది. లేబర్‌ కమిషనర్‌ సీరియస్‌ అవుతుండడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఉద్యోగులు ప్రకటించగా.. తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటున్నట్లు సంస్థ హామీ ఇచ్చింది.

Updated Date - May 10 , 2024 | 04:46 AM