Share News

AP Election 2024: మే 13న రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ: నారా చంద్రబాబు

ABN , Publish Date - Apr 28 , 2024 | 09:23 PM

మే 13న ఆంధప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అవుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ పాలనలో ఎవ్వరికీ స్వేచ్ఛ లేదని మండిపడ్డారు. ఇసుక, మద్యం, గ్రావెల్, భూ సంపదను దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో ఏ కులానికి, మతానికి మంచి జరగలేదని విమర్శించారు. ‘‘జగన్‌కు డ్రైవింగ్ రాదు. రివర్స్ గేర్‌లో వెళ్లి రాష్ట్రాన్ని యాక్సిడెంట్ చేశాడు. మాటలు చెప్పి బటన్ నొక్కితే ఆదాయం పెరగదు’’ అన్నారు.

AP Election 2024: మే 13న రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ: నారా చంద్రబాబు

కర్నూలు: మే 13న ఆంధప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అవుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ పాలనలో ఎవ్వరికీ స్వేచ్ఛ లేదని మండిపడ్డారు. ఇసుక, మద్యం, గ్రావెల్, భూ సంపదను దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో ఏ కులానికి, మతానికి మంచి జరగలేదని విమర్శించారు. ‘‘జగన్‌కు డ్రైవింగ్ రాదు. రివర్స్ గేర్‌లో వెళ్లి రాష్ట్రాన్ని యాక్సిడెంట్ చేశాడు. మాటలు చెప్పి బటన్ నొక్కితే ఆదాయం పెరగదు. మంచి ఆలోచన చేసి కష్టపడితే ఆదాయం వస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీని అభివృద్ధి చేసేందుకు రాత్రీపగలు కష్టపడ్డాను. తలసరి ఆదాయం బాగా పెరిగింది. బటన్ నొక్కి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసిన దుర్మార్గుడు జగన్’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడూరు ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు ఈ మేరకు మాట్లాడారు.


మంచి పాలన ఉంటే ప్రజలు బాగుంటారని, చెత్త పాలనలో జనం ఇబ్బందులు పడతారని, జగన్ పాలనలో ఇదే జరిగిందని చంద్రబాబు విమర్శించారు. ‘‘1996-1997లో వర్గీకరణ చేయడంతో మాదిగలకు న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రధాని మోడీ కూడా ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపారు. మళ్లీ మాదిగలకు న్యాయం చేస్తాను. మనం గెలుస్తున్నాం. అనుమానం లేదు. ఇక మనకు తిరుగు లేదు. ప్రజల సంక్షేమం కోసం టీడీపీ- జనసేన- బీజేపీ కలిశాం. గతంలో ఎన్డీయేలో ఉన్నా ముస్లింలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఏ చిన్న ఇబ్బందులు కూడా కలగ లేదు. నాలుగు 4 శాతం ఉద్యోగాలు తీసేస్తారని ముస్లింల ఇళ్ల వద్దకు వెళ్లి జగన్ విషప్రచారం చేస్తున్నారు. నంద్యాలలో అబ్దుల్ సలాం దొంగగా చిత్రీకరించి వేధింపులకు గురి చేశారు. దీంతో అబ్దుల్ సలాం కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన పార్టీ టీడీపీ. అబ్దుల్ సలాంను చంపిన పార్టీ వైసీపీ’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.


హైదరాబాద్‌ను మించిన క్యాపిటల్ కడతా

‘‘ప్రజల ఆస్తులను దోచుకోవడం తప్ప ఎలాంటి మేలు చేయలేదు. రాయలసీమ ప్రాజెక్టుల కోసం నేను రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టాను. జగన్ కేవలం 2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇది నా విజన్. గత ఎన్నికల ముందు అమరావతి రాజధానికి జగన్ మద్దతు తెలిపారు. అధికారంలోకి రాగానే మూడు ముక్కలాట ఆడాడు. ఇప్పటికీ మనకు రాజధాని లేదు. నాకు బ్రాండ్ ఇమేజ్ ఉంది. సీబీఎన్ అంటే అభివృద్ధి. హైదరాబాద్‌ను మించిన క్యాపిటల్ కడతా. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా 35 వేల ఎకరాలు ఇచ్చారు. పదివేల ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంది. ఎకరా ముప్పై కోట్లకు అమ్ముకుంటే మూడు లక్షల కోట్ల రూపాయల ఆస్తి అవుతుంది. మూడు లక్షల కోట్ల ఆస్తిని జగన్ విధ్వంసం చేశాడు. రాష్ట్రాన్ని నంబర్ వన్ చేయడం నా జీవితాశయం. అవకాశం ఇవ్వండి చేసి చూపిస్తా. ఓర్వకల్లు మండలంలో ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పార్కును ఏర్పాటు చేశాను. ‘వివేకం’ సినిమా చూశారా. గొడ్డలితో కిరాతకంగా చంపారు. ఇలాంటి వ్యక్తి కావాలా మీకు. రాష్ట్ర ప్రజలు గొర్రెలు అనుకుంటున్నారు. ఎన్నికల్లో జగన్‌కు దిమ్మదిరిగే షాక్ ఇవ్వాలి’’ అని ఓటర్లను చంద్రబాబు కోరారు.

Updated Date - Apr 28 , 2024 | 09:24 PM