Share News

CSK vs PBKS: ముగిసిన చెన్నై ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

ABN , Publish Date - May 01 , 2024 | 09:40 PM

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులే చేయగలిగింది. నిజానికి.. హోమ్ గ్రౌండ్ కాబట్టి చెన్నై ఊచకోత కోస్తుందని, 200కి మించి భారీ స్కోర్ చేస్తుందని...

CSK vs PBKS: ముగిసిన చెన్నై ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులే చేయగలిగింది. నిజానికి.. హోమ్ గ్రౌండ్ కాబట్టి చెన్నై ఊచకోత కోస్తుందని, 200కి మించి భారీ స్కోర్ చేస్తుందని అభిమానులు ఆశించారు. కానీ, పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో చెన్నై 162 పరుగులకే పరిమితం అయ్యింది. రుతురాజ్ గైక్వాడ్ (62) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టడం, రహానే (29) పర్వాలేదనిపించడంతో.. చెన్నై ఆ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. చివర్లో ధోనీ ఒక సిక్స్, ఒక ఫోర్‌తో ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్ ఇచ్చాడు కానీ.. చివరి బంతికి రనౌట్ అయ్యాడు. ఈ సీజన్‌లో ధోనీ ఔట్ అవ్వడం ఇదే మొదటిసారి.

తొలుత టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంపిక చేయడంతో.. చెన్నై బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఓపెనర్లు రహానే, రుతురాజ్ శుభారంభమే అందించారు కానీ.. వీళ్లు దూకుడుగా ఆడలేదు. నిదానంగా, ఆచితూచి ఆడుతూ వచ్చారు. అయితే.. 64 పరుగుల వద్ద రహానే ఔట్ అయ్యాక, చెన్నై వెనువెంటనే మరో రెండు వికెట్లు కోల్పోయింది. దూబే (0) డకౌట్ అవ్వగా, జడేజా 2 వ్యక్తిగత పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత వచ్చిన రిజ్వి కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. 23 బంతులాడిన అతను కేవలం 21 పరుగులే చేశాడు. మోయిన్ అలీ సైతం 15 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. చివర్లో రెండు ఓవర్లు మిగిలున్నప్పుడు వచ్చిన ధోనీ.. 11 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ సహకారంతో 15 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.

ఇక పంజాబ్ బౌలర్ల విషయానికొస్తే.. వరల్డ్‌కప్ జట్టుకి ఎంపికైన అర్ష్‌దీప్ సింగ్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక వికెట్ తీసిన అతను ఏకంగా 52 పరుగులు ఇచ్చాడు. అతనితో పాటు సామ్ కరన్ సైతం 3 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చేశాడు. రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ పొదుపుగా బౌలింగ్ వేశారు. రాహుల్ 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయగా.. హర్‌ప్రీత్ 17 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇక రబాడా ఒక వికెట్ తీసి, 23 పరుగులే ఇచ్చాడు. మరి.. చెన్నై నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ఛేధిస్తుందా? లేదా? వేచి చూడాలి.

Updated Date - May 01 , 2024 | 09:40 PM