అంబుజా సిమెంట్స్ లాభం రూ.1,055.16 కోట్లు
ABN , Publish Date - May 02 , 2024 | 04:12 AM
అదానీ గ్రూప్లోని అంబుజా సిమెంట్స్ మార్చి 31వ తేదీతో ముగిసిన నాలుగో త్రైమాసికానికి అద్భుతమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ కాలానికి అనుబంధ కంపెనీలతో...
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్లోని అంబుజా సిమెంట్స్ మార్చి 31వ తేదీతో ముగిసిన నాలుగో త్రైమాసికానికి అద్భుతమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ కాలానికి అనుబంధ కంపెనీలతో కలిసి కంపెనీ రూ.1,525.78 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.763.30 కోట్లతో పోలిస్తే ఇది రూ.762.48 కోట్లు ఎక్కువ. ఇదే కాలంలో కంపెనీ నిర్వహణ ఆదాయం రూ.7,965.98 కోట్ల నుంచి రూ.8,893.99 కోట్లకు, స్థూల ఆదాయం రూ.9,127.45 కోట్లకు చేరాయి. గత ఏడాది ఆఖరి త్రైమాసికంలో కొనుగోలు చేసిన సంఘీ ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాలతో కలిసి మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు విడుదల చేసినట్టు అంబుజా సిమెంట్ తెలిపింది. ఏసీసీ, సంఘీ ఇండస్ట్రీస్ను తీసివేస్తే అంబుజా సిమెంట్ నికర లాభం మార్చి త్రైమాసికంలో రూ.502.40 కోట్ల నుంచి రూ.532.29 కోట్లకు చేరింది. ఇదే సమయంలో కంపెనీ స్టాండ్ అలోన్ నిర్వహణ ఆదాయం రూ.4,780.32 కోట్లకు చేరింది. ఆర్థిక ఫలితాలు బాగుండడంతో రూ.2 ముఖ విలువ గత ఒక్కో షేరుపై వాటాదారులకు రూ.2 చొప్పున డివిడెండ్ చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.