పరీక్ష రాసిన రెండు గంటల్లోనే...
ABN , First Publish Date - 2020-10-23T11:43:26+05:30 IST
వైవీ యూనివర్శిటీ పీజీ సెట్-2020 ఫలితాలను వీసీ సూర్యకళావతి గురువారం సాయంత్రం విడుదల చేశారు.
వైవీయూ పీజీ సెట్ ఫలితాలు విడుదల
కడప (వైవీయూ), అక్టోబరు 22: వైవీ యూనివర్శిటీ పీజీ సెట్-2020 ఫలితాలను వీసీ సూర్యకళావతి గురువారం సాయంత్రం విడుదల చేశారు. ఫలితాలను పరీక్ష పూర్తయిన రెండు గంటలలోపే విడుదల చేయడంతో సిబ్బందిని, అధికారులను వీసీ అభినందించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ వైవీ యూనివర్శిటీ అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో 2,360 సీట్లు ఉన్నాయి. 2968 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా గురువారం జరిగిన పరీక్షకు 2284 మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే పరీక్ష రాసిన ప్రతి విద్యార్థికి ర్యాంకు వచ్చిందని, కౌన్సిలో మెరిట్ ఆధారంగా పీజీ సీట్లు కేటాయిస్తామని తెలిపారు.
ప్రతి విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను వెంట తీసుకురావాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులు పరీక్ష రాసిన రెండు గంటల్లోనే ఫలితాలు విడుదల చేయడంలో అధ్యాపకులు కీలకపాత్ర పోషించారని ఈ సందర్భంగా వారిని ప్రశంసించారు. శుక్రవారం ఉదయం నుంచి వైవీయూ వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో రిజిస్ట్రార్ విజయరాఘవప్రసాద్, డీవోఏ డైరెక్టర్ ప్రొఫెసర్ గంగయ్య, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.