13 ఏళ్ల నాటి త్రోబ్యాక్ ఫొటో పోస్టు చేసిన యువరాజ్ సింగ్
ABN , First Publish Date - 2020-09-19T22:45:08+05:30 IST
సరిగ్గా 13 సంవత్సరాల క్రితం నాటి త్రోబ్యాక్ ఫొటోను యువరాజ్ సింగ్ పోస్టు చేశాడు. 2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో జరిగిన
న్యూఢిల్లీ: సరిగ్గా 13 సంవత్సరాల క్రితం నాటి త్రోబ్యాక్ ఫొటోను యువరాజ్ సింగ్ పోస్టు చేశాడు. 2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో యువరాజ్ సింగ్ చెలరేగిపోయాడు. స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్లో మొత్తం ఆరు బంతులను స్టాండ్స్ బయటకు పంపి రికార్డు సృష్టించాడు. యువరాజ్ ఒక్కో సిక్స్ కొడుతుంటే స్టేడియంలో మార్మోగిపోయింది. యువరాజ్ స్టైలిష్గా, అలవోకగా బంతులను బౌండరీ బయటకు తరలిస్తుంటే ప్రేక్షకులు ముగ్ధులైపోయారు. మైమరచిపోయారు. అప్పటి ఫొటోను పోస్టు చేసిన యువరాజ్ ‘‘13 ఏళ్లు! రోజులు ఎలా గడిచిపోతున్నాయో!! జ్ఞాపకాలు’’ అని క్యాప్షన్ తగిలించాడు.
19 సెప్టెంబర్ 2007.. భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని రోజు ఇది. కింగ్స్మీడ్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో యువరాజ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించాడు.
అప్పటికి భారత్ 18 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్, కెప్టెన్ ధోనీ క్రీజులో ఉన్నారు. డెత్ ఓవర్లలో వీలైనన్ని పరుగులు పిండుకోవాలని ఇద్దరూ అనుకున్నారు. 18వ ఓవర్లో ఆండ్రూ ఫ్లింటాఫ్ బౌలింగ్లో రెండు ఫోర్లు కొట్టిన యువీ మంచి ఊపుమీదున్నాడు.
19వ ఓవర్ వేసేందుకు బ్రాడ్ బంతి అందుకున్నాడు. తొలి బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా యువరాజ్ సిక్స్ బాదాడు. రెండో బంతిని స్క్వేర్ లెగ్ మీదుగా స్టాండ్స్లోకి పంపాడు. మూడో బంతిని వైడ్ లాంగ్ ఆఫ్లోకి, ఆ తర్వాత బ్రాడ్ వేసిన ఫుల్ టాస్ను డీప్ పాయింట్ మీదుగా, ఐదో బంతిని స్క్వేర్ లెగ్ మీదుగా, చివరి బంతిని వైడ్ లాంగ్ ఆన్లోకి తరలించి రికార్డు సృష్టించాడు.
యువరాజ్ బాదుడుకు ఏం జరుగుతుందో బ్రాడ్కు కాసేపు అర్థం కాలేదు. అతడి ముఖం పాలిపోయింది. ఏడుపు ఒకటే తక్కువ. బ్రాడ్ మదిలో అది చెరగని చేదు గుళికగా మిగిలిపోతే, యువరాజ్కు ఆ గేమ్ మధుర స్మృతిగా మిగిలిపోయింది.