యువరాజ్, హర్భజన్ నన్ను బలవంతంగా తిట్టారు: అఫ్రిదీ
ABN , First Publish Date - 2020-05-27T01:05:08+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మత విద్వేషంతో మోదీ మత
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మత విద్వేషంతో మోదీ మత రాజకీయాలు చేస్తున్నారని ఆఫ్రిదీ ఆరోపణలు చేశారు. అంతేకాక.. కశ్మీరీలపై మోదీ అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై మోదీ జవాబివ్వాలని ఆఫ్రిదీ డిమాండ్ చేశారు.
ఈ ఘటన జరిగే కొద్ది రోజుల ముందే ‘షాహిద్ అఫ్రిదీ’ ఫౌండేషన్కు టీం ఇండియా ఆటగాళ్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్లు మద్దతు ఇచ్చి.. విమర్శలు కూడా ఎదురుకున్నారు. కానీ, దీని తర్వాత వాళ్ల అఫ్రిదీపై విరుచుకుపడ్డారు. అఫ్రిదీ అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని వాళ్లు అన్నారు. అయితే వాళ్లిద్దరు తనను బలవంతంగా తిట్టారని.. లేకుంటే అలా చేసేవాళ్లు కాదని.. అఫ్రిదీ తాజాగా అన్నాడు.
‘‘నా ఫౌండేషన్కి మద్దతు ఇచ్చినందుకు ఇప్పటికీ యువరాజ్ సింగ్, హర్భజన్ పట్ల నేను కృతజ్ఞతతో ఉన్నాను. వాళ్లపై ఒత్తిడి ఉంది.. అదే అసలైన సమస్య. వాళ్లు ఆ దేశంలో ఉంటారు. కాబట్టి వాళ్లు అనక తప్పలేదు. ఆ దేశంలో ప్రజలు పీడింబడుతున్నారని వాళ్లకి తెలుసు. అంతకు మించి నేను ఎక్కువ మాట్లాడను’’ అని అఫ్రిదీ అన్నారు.