వైఎస్ బిడ్డలు దొంగలు కాదు.. గజదొంగలు కాదు: విజయలక్ష్మి
ABN , First Publish Date - 2021-07-08T23:14:41+05:30 IST
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవర్భావ సభలో వైఎస్ విజయలక్ష్మి భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్ బిడ్డలు దొంగలు కాదని.. గజదొంగలు కాదన్నారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవర్భావ సభలో వైఎస్ విజయలక్ష్మి భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్ బిడ్డలు దొంగలు కాదని.. గజదొంగలు కాదన్నారు. మాటిస్తే ముందుకెళ్లడం తండ్రి నుంచి షర్మిల నేర్చుకుందన్నారు. వైఎస్ వచ్చాక తుపాకుల మోతలు ఆగిపోయాయని, పల్లె బతికిందన్నారు. రక్తం కాదు.. నీరు మాత్రమే పారాలని ఆలోచించారన్నారు.
ప్రాజెక్టులన్నీ వైఎస్ హయాంలోనే మొదలయ్యాయని, షర్మిలను మీ కుటుంబంలో ఒకరిగా చూడండని కోరారు. రాజన్న రాజ్యం తెలంగాణ జన్మహక్కు అని షర్మిల నమ్ముతోందన్నారు. తెలంగాణ బిడ్డలకు బంగారు భవిష్యత్ ఇవ్వడానికి ముందుకొస్తోందన్నారు. అన్ని రాష్ట్రాలు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుందని, సమస్యలు పరిష్కరించుకుని రెండు రాష్ట్రాలు ఎదగాలని విజయలక్ష్మి అన్నారు. మాటలు మార్చడం వారికి తెలియదని.. మాటకు ప్రాణం ఇచ్చేవాళ్లన్నారు. తమ కుటుంబానికి దాచుకోవడం.. దోచుకోవడం తెలియదన్నారు. వైఎస్ అన్ని ప్రాంతాలను సమానంగా చూశారన్నారు.