సర్కారు వైఫల్యం వల్లే అత్యాచారాలు

ABN , First Publish Date - 2022-06-05T08:05:15+05:30 IST

కేసీఆర్‌ సర్కారు వైఫల్యం వల్లే రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నాయని వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు.

సర్కారు వైఫల్యం వల్లే అత్యాచారాలు

అఘాయిత్యం జరిగి 5రోజులైనా నిందితులను పట్టుకోలేకపోయారు

మద్యం, డ్రగ్స్‌ వల్లే దౌర్జన్యాలు: షర్మిల


తల్లాడ/ఏన్కూరు, జూన్‌ 4: కేసీఆర్‌ సర్కారు వైఫల్యం వల్లే రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నాయని వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. హైదరాబాద్‌ నడిబొడ్డున బాలికపై అత్యాచారం జరిగి ఐదురోజులైనా నిందితులను పట్టుకోలేకపోవడానికి సీఎం కేసీఆర్‌ పాలనా వైఫల్యమే కారణమని ధ్వజమెత్తారు. హోం మంత్రి, వక్ఫ్‌బోర్డు చైర్మన్‌, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అత్యంత పైశాచికంగా బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఐదు రోజుల తర్వాత మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో ఆదేశించడం చూస్తే ట్విటర్‌ వేదికగా నిర్లక్ష్య పాలన సాగిస్తున్నట్లు ఉందని మండిపడ్డారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 84వ రోజైన శనివారం ఖమ్మం జిల్లా తల్లాడ, ఏన్కూరు మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా తల్లాడ మండలం అన్నారుగూడెంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.


బాలికపై అత్యాచారం చేసినవారు అధికార పక్షానికి చెందినవారు కావడంతో ఈ ఘోరాన్ని బయటకు రానివ్వలేదని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారని, జీతం ఎక్కడ తీసుకుంటున్నారని ప్రశ్నించారు. పోలీసులు టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలుగా, పనోళ్లుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ నగరమంతా మద్యం, డ్రగ్స్‌, పబ్‌ కల్చర్‌ పెరిగి మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ నియంత పాలన అంతమొందించడానికే వైఎ్‌సఆర్‌టీపీని స్థాపించానని చెప్పారు. రూ.16 వేల మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని రూ.4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా కేసీఆర్‌ మార్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్టీసీ కార్మికులకు సంఘాలు లేకుండా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 

Updated Date - 2022-06-05T08:05:15+05:30 IST