YS Sharmila: ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకపోతే ఎలా ముఖ్యమంత్రి గారు: షర్మిల
ABN , First Publish Date - 2022-07-23T17:40:06+05:30 IST
నష్టపరిహారం ఇస్తామని హామీ ఇవ్వడం..మరిచి పోవడమే కేసీఆర్కు తెలుసని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల విమర్శించారు.
భద్రాద్రి కొత్తగూడెం: నష్టపరిహారం ఇస్తామని హామీ ఇవ్వడం..మరిచి పోవడమే కేసీఆర్(KCR)కు తెలుసని వైఎస్సార్టీపీ అధినేత్రి(YSRTP chief) షర్మిల(Sharmila) విమర్శించారు. శనివారం పినపాక మండలం రావి గూడెం గ్రామంలో పర్యటించిన షర్మిల గోదావరి వరదలతో మునిగిపోయిన ఇళ్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... గతంలో వరంగల్, ఖమ్మం రైతులను ఇలానే మోసం చేశారని మండిపడ్డారు. మీడియా ముందు మాట్లాడుతారని.. ఫామ్ హౌజ్లో పడుకుంటారని దుయ్యబట్టారు. వరదలతో ప్రజలు సర్వం కోల్పోయారన్నారు. తక్షణ సహాయం చేయలేని ముఖ్యమంత్రిగా మీరు ఎందుకు ఉన్నారని వైఎస్సార్టీపీ అధినేత్రి ప్రశ్నించారు.
‘‘మీకు పరిపాలన చేతకాక పోతే రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేయండి. మీరు ఇంకా పదవిని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారు. లక్షల మంది జీవితాలు ఆగం అయ్యాయి. ఇస్తామని చెప్పిన రూ.10 వేల సహాయం కూడా ఇంకా అందలేదు. 10 వేలు ఎటూ సరిపోవు.. రూ.25 వేలు సహాయం అందించాలి. సహాయం అందిస్తాం అని రబ్బర్ బియ్యం ఇచ్చారని బాధితులు చెప్తున్నారు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకపోతే ఎలా ముఖ్యమంత్రి గారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలి’’ అంటూ షర్మిల డిమాండ్ చేశారు.