బిల్లుల కోసం హైకోర్టు మెట్లెక్కిన YSRCP జడ్పీటీసీ
ABN , First Publish Date - 2022-01-09T12:37:30+05:30 IST
బిల్లుల కోసం హైకోర్టు మెట్లెక్కిన YSRCP జడ్పీటీసీ
చిత్తూరు జిల్లా/ఎర్రావారిపాళెం : గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు సకాలంలో చెల్లించక పోగా కాళ్లు అరిగేలా తిప్పించుకుంటున్నారంటూ అధికార పార్టీ జడ్పీటీసీ ఒకరు హైకోర్టులో కేసు వేశారు. ఎర్రావారిపాళెం జడ్పీటీసీ జంగా కరుణాకర రెడ్డి కాంట్రాక్టర్ కూడా. సొంత మండలంలోని యల్లమంద పంచాయతీ చింతలవారిపల్లె వద్ద రెండు కల్వర్టు నిర్మాణాలు, మాలేవాండ్లపల్లె వద్ద ఓ కల్వర్టు పనులు 2021లో చేశానని పిటీషన్లో పేర్కొన్నారు. పనుల నెంబర్లు 2021లో సీఎఫ్ఎంఎస్- 200419తో జరిగిన పని బిల్లు రూ.135293, సీఎఫ్ఎంఎస్-2205460తో జరిగిన పని బిల్లు రూ194258, సీఎఫ్ఎంఎస్-220418తో జరిగిన పని బిల్లు రూ.192130, సీఎఫ్ఎంఎస్- 200417తో జరిగిన పని బిల్లు రూ.192130 ప్రకారం రూ.713811 తనకు రావాల్సివున్నా అధికారులు చెల్లించడం లేదంటూ కోర్టుకెక్కాడు.
సదరు పనులకు నిధులు 14వ ఆర్థిక సంఘం కింద మంజూరైనవేనని తెలియ జేశాడు. కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, ఏపీ ప్రధాన కార్యదర్శి, పీఆర్ కమిషనర్, జేసీ(అభివృద్ధి)తో పాటు, డివిజనల్, మండల స్థాయి అధికారులను ప్రతివాదులుగా చేర్చి రిట్ పిటీషన్ హైకోర్టులో దాఖలు చేశారు. పరిశీలించిన కోర్టు బిల్లులను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.