Tadipatri లో నువ్వెంత అంటే నువ్వెంత.. ఎమ్మెల్యే పదవికి ఎసరుపెడతారేమోనని Peddareddy భయం!

ABN , First Publish Date - 2021-07-22T20:21:25+05:30 IST

ఇందులో అధికారపార్టీ ఎవరికి సపోర్ట్‌గా ఉండనుంది? అనేది ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఇన్‌సైడ్‌లో చూద్దాం...

Tadipatri లో నువ్వెంత అంటే నువ్వెంత.. ఎమ్మెల్యే పదవికి ఎసరుపెడతారేమోనని Peddareddy భయం!

  • ఫ్యాక్షన్‌ రాజకీయాలకు పెట్టిందిపేరు తాడిపత్రి
  • కొత్తగా తెరపైకి రమేష్‌రెడ్డి!
  • తాడిపత్రి వైసీపీలో వర్గపోరు
  • ఎమ్మెల్యే పెద్దారెడ్డికి రమేష్‌రెడ్డి పోటీ పాలిటిక్స్
  • కొడుకు హర్షవర్దన్‌ రెడ్డి కోసం ఎమ్మెల్యే ఆరాటం
  • మున్సిపల్‌ చైర్మన్‌ కోసం ఆరాటపడి భంగపడ్డ రమేష్‌రెడ్డి 
  • వైసీపీ వర్గపోరులో లాభపడ్డ తెలుగుదేశం!
  • గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ట్రై చేసిన రమేష్‌రెడ్డి
  • అక్రమ కట్టడాల పేరుతో రమేష్‌రెడ్డి వర్గంపై ఎమ్మెల్యే కత్తి!

ఆ నియోజకవర్గంలో అధికారపార్టీలో ముసలం పుట్టి ముదురుతోందట. ఆ ఎమ్మెల్యేకు సొంత పార్టీలోనే ప్రతిపక్షం తయారైందట. వారసుడిని కుర్చీలో కూర్చోబెట్టే ప్రయత్నం చేసిన శాసనసభ్యుడి ఆశలను అడియాసలు చేశారట పార్టీలోని వైరివర్గం నేతలు. మున్ముందు ఎన్నికల్లో ఎమ్మెల్యేను ఓడించేందుకు కంకణం కట్టుకుని తిరుగుతున్నారట పార్టీలోని ఆయనకు పడని వర్గం. ఒకప్పుడు తోటలను ధ్వంసం చేసిన చరిత్ర ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు ఇళ్లను కూల్చివేసే కార్యక్రమం జరుగుతోందట. ఇంతకీ ఈ కోల్డ్‌వార్‌ ఎక్కడ జరుగుతోంది. ఇందులో అధికారపార్టీ ఎవరికి సపోర్ట్‌గా ఉండనుంది? అనేది ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఇన్‌సైడ్‌లో చూద్దాం.


పెద్దారెడ్డి ప్లాన్ ఫెయిల్..

తాడిపత్రి.. ఫ్యాక్షన్‌ రాజకీయాలకు పెట్టింది పేరు.ఈ నియోజకవర్గం అంటనేనే జేసీ బ్రదర్స్‌ పేరు గుర్తుకొస్తుంది. వారికి ధీటుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేరు ఈ మధ్య వినిపిస్తోంది. లేటెస్టుగా వీరిద్దరికంటే ఎక్కువగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి తడాఖా చూపిస్తున్నారనే టాక్‌ తాడిపత్రిలో వస్తోందట. వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధిపత్య రాజకీయాల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్‌ పార్టీ కార్యదర్శి రమేష్‌రెడ్డి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయట. ఇద్దరిమధ్య కోల్డ్‌వార్‌  గత అసెంబ్లీ ఎన్నికల నుంచే ఉందట. ఆ పోరుకాస్తా మున్సిపల్‌ ఎన్నికలతో యుద్ధంగా మారిందట. ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన కొడుకు హర్షవర్దన్‌రెడ్డిని మున్సిపల్‌ చైర్మన్‌ సీట్లో కూర్చొబెట్టి మురిసిపోవాలని చూశారట.


ఈ తతంగం అంతా చూస్తుంటే...! 

మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమికి కారణమైన రమేష్‌రెడ్డి అనుచరుడైన భాషా తదితరుల ఇళ్లను కూల్చివేసేందుకు ఆర్డీటీ కాలనీకి ఎమ్మెల్యే  ఏకంగా జేసీబీలతో రావడం.. ఎలా కూలగొడుతారో చూస్తామంటూ రమేష్‌రెడ్డి వాగ్వాదానికి దిగడం తాడిపత్రిలో హాట్‌టాపిక్‌ అయింది. పట్టాకాగితాలు రమేష్‌రెడ్డి చూపిస్తే అధికారులు అక్రమ నిర్మాణాలని చెబుతున్నారని ఎమ్మెల్యే ఢీ అంటే ఢీ అనుకున్నారట. రెండు వర్గాల అనుచరుల ఈలలు, కేకలతో పరిస్థితి చేయిదాటిపోయింది. ఈ తతంగం అంతా చూస్తుంటే తాడిపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డిల మద్య విబేధాలు ఏ టర్న్ తీసుకుంటాయో... వేచి చూడాల్సిందే.. అనుకుంటున్నారట ప్రజలు.

టాక్ ఏంటి..!?

ఎమ్మెల్యే వర్సెస్‌ పార్టీ కార్యదర్శి వార్‌లో ఎత్తులకు పైఎత్తు రాజకీయాల్లో  కరోనాకాలాన్ని కూడా వాడుకున్నారట. డాక్టర్ల పనితీరుబాగోలేదని రమేష్‌రెడ్డి ఆందోళన చేశారు.  పోటీ రాజకీయం నడిపిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి డాక్టర్లతో చేతులు కలిపి రమేష్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రైవేట్‌ నర్సింగ్‌హోంలను మూసివేయించారనే టాక్‌ ఉంది. రమేష్‌రెడ్డికి చెక్‌పెట్టే ప్రయత్నాల్లో ఉన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. అక్రమ కట్టడాలంటూ పార్టీలోని ప్రత్యర్థుల ఇళ్లను కూల్చే పనిమొదలెట్టాడట.


అడ్డుపడ్డారని ఊగిపోతున్న పెద్దారెడ్డి..

శాసనసభ్యుడు పెద్దారెడ్డి, వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొణిదెల రమేష్‌రెడ్డికి మధ్య ఎమ్మెల్యే సీటు విషయంలోనే తేడా వచ్చిందట. తాడిపత్రి నియోజవర్గం ఇంఛార్జ్‌గా ఉన్న రమేష్‌రెడ్డికే ఎమ్మెల్యే టికెట్‌ కన్‌ఫాం అనుకున్నారట. అయితే హైకమాండ్.. పెద్దారెడ్డికి ప్రిఫరెన్స్‌ ఇచ్చి రమేష్‌రెడ్డికి తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ ఇస్తామని హామీ ఇచ్చిందట. అప్పుడు ఎమ్మెల్యే టికెట్‌ దక్కకుండా, ఇప్పుడు మున్సిపల్‌ చైర్మన్‌గిరీ దక్కకుండా ఎమ్మెల్యే అడ్డుపడ్డారనే కసి రమేష్‌రెడ్డి వర్గంలో రోజురోజుకి పెరిగిపోతుందట. మరోవైపు ఎమ్మెల్యే హోదాలో ఉన్న తాను తన కొడుక్కి మున్సిపల్‌ చైర్మన్‌ పోస్టుకోసం ప్రయత్నిస్తే రమేష్‌ రెడ్డి కాకుండా చేశారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని పెద్దారెడ్డి ఊగిపోతున్నారట.


ఎమ్మెల్యేకు తలంటిన హైకమాండ్!

వైసీపీ హైకమాండ్ తనను మున్సిపల్‌ చైర్మన్‌ చేస్తుందని ఆశపడ్డ రమేష్‌రెడ్డి.. ఎమ్మెల్యే పాలిటిక్స్‌ తెలుసుకుని తనవర్గం వారితో నామినేషన్లు వేయించారట. అయితే హైకమాండ్‌ ఆదేశాలతో ఆయన మనుషులు విత్‌డ్రా చేసుకోవడం తప్పలేదట. అసలే రగిలిపోతున్న రమేష్‌రెడ్డి వర్గం ఎమ్మెల్యేపై కసి తీర్చుకునేందుకు పార్టీ ప్రత్యర్థి అయిన తెలుగుదేశానికి సహకరించారనే టాక్‌ వచ్చింది. రాష్ట్రంలో ఎక్కడా ప్రభావం చూపించలేని తెలుగుదేశం పార్టీ ఒక్క తాడిపత్రిలోనే చైర్మన్‌గిరీని నెగ్గడం అదీ జేసీ బ్రదర్స్ పట్టునిలుపుకునేలా చేయడం వెనక రమేష్‌ రెడ్డి వర్గం రాజకీయాలు చేసిందని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి వర్గం హైకమాండ్‌కు ఫిర్యాదు చేసిందట. పార్టీ పాలిటిక్స్‌ ఎలా ఉన్నా.. ప్రత్యర్థి పార్టీకి మున్సిపాలిటీని చేజేతులా అప్పజెప్పడంపై ఎమ్మెల్యేకు హైకమాండ్ తలంటుపోసిందట.



Updated Date - 2021-07-22T20:21:25+05:30 IST