Atmakur byelection: ఆత్మకూరు ఉప ఎన్నిక హీట్.. ఓడిపోకూడదని వైసీపీ ఏం చేస్తోందంటే..
ABN , First Publish Date - 2022-06-07T22:44:48+05:30 IST
ఆత్మకూరులో ప్రధానంగా వైసీపీ, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. టీడీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లో దూరంగా ఉన్నాయి. తొలుత వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకేనని..
నెల్లూరు: ఆత్మకూరులో ప్రధానంగా వైసీపీ, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. టీడీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లో దూరంగా ఉన్నాయి. తొలుత వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకేనని ఆ పార్టీ భావించింది. కానీ ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో వ్యూహం మార్చింది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నామినేషన్ల పర్వం ముగియ గానే మందీమార్భలంతో మోహరించింది. మండలానికి ఒక మంత్రిని, ఓ ఎమ్మెల్యేను ఇన్చార్జులుగా నియమించారు. వారంతా ఈ నెల 10వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు వీరు ఇక్కడే మకాం వేసి ప్రచారంలో పాల్గొనేలా వ్యూహం రూపొందించారు. వైసీపీ మూడేళ్ల పాలనలో ప్రజావ్యతిరేకత పొడ చూపింది.
దీంతో అత్యధిక మెజారిటీ సాధించి ప్రజా వ్యతిరేకత లేదని నిరూపించుకోవడానికి వైసీపీ అగ్రనేతలు తపన పడుతున్నారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే నామినేషన్లు ముగిసిన తర్వాత సోమవారం ఆత్మకూరు శ్రీధర్ గార్డెన్స్లో నియోజకర్గ ఎన్నికల ఇన్చార్జి బాలినేని, జిల్లా మంత్రి కాకాణి అన్ని మండలాల ముఖ్యనేతలు, వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేశారు. ప్రచార వ్యూహాలపై చర్చించారు.