YSRCP లో ఉన్నా ఉపయోగం లేదు.. : MLAను చుట్టుముట్టిన గ్రామస్థులు
ABN , First Publish Date - 2022-05-27T12:18:27+05:30 IST
YSRCP లో ఉన్నా ఉపయోగం లేదు.. : MLAను చుట్టుముట్టిన గ్రామస్థులు
ఒంగోలు/బయ్యవరం(కురిచేడు) : తాము పార్టీలో (YSRCP) ఉన్నా ఉపయోగం లేదు. తమ రేషన్ కార్డును తొలగించారు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా కార్డు మాత్రం రాలేదని మాజీ సర్పంచ్ బొల్లేపల్లి ఆంజనేయులు భార్య రమణమ్మ.. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ (MLA Maddisetty Venugopal) ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం కురిచేడు మండలం పెద్దవరం సచివాలయం పరిధిలోని బయ్యవరంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యలు పరిష్కరించాలని గ్రామస్థులు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను చుట్టుముట్టారు. అడుసుమల్లి నాగలక్ష్మి తన భూమి 17ఏళ్లుగా ఆన్లైన్ కాలేదని, ఎన్నిసార్లు తహసీల్దార్ కార్యాలయానికి తిరిగినా పరిష్కరించలేదని తెలిపింది.
గ్రామంలో మంచినీటిని అందించడానికి రూ.3లక్షలతో ఆర్వో ప్లాంట్ నిర్మించానని ఏళ్లు గడుస్తున్నా బిల్లులు మంజూరు చేయలేదని అడుసుమల్లి రాంబాబు ఫిర్యాదు చేశాడు. శాఖమూరి సుబ్బులు తనకు పింఛన్ రావడం లేదని ఎమ్మెల్యేకు తెలిపింది. వెంటనే రోడ్డు నిర్మించాలని గ్రామస్థులు కోరారు. అనంతరం ఎమ్మెల్యే అధికారులతో సమావేశమయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రోడ్డు, తాగునీరు, గృహాలు, రెవెన్యూ సమస్యలను తనదృష్టికి తెచ్చారని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. త్వరలోనే రోడ్డును నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగుల్మీరా, ఎంపీడీవో దారా హనుమంతరావు, ఈవోఆర్డీ నరేష్, పంచాయతీరాజ్ ఏఈ ఆదిరెడ్డి, ఎంఈవో వస్రాంనాయక్, జడ్పీటీసీ సభ్యుడు వెంకట నాగిరెడ్డి, బయ్యవరం సర్పంచ్ నాగేశ్వరావు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.