46 మంది క్రీడాకారులకు వైఎస్సార్‌ పురస్కారాలు

ABN , First Publish Date - 2020-11-29T06:05:12+05:30 IST

జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచి పతకాలను సాధించిన 46 మంది క్రీడాకారులకు వైఎస్సార్‌ క్రీడా పురస్కారాలను శనివారం అందజేశారు.

46 మంది క్రీడాకారులకు వైఎస్సార్‌ పురస్కారాలు
క్రీడాకారులకు పురస్కారాలను అందించిన కలెక్టర్‌ ఇంతియాజ్‌

విజయవాడ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచి పతకాలను సాధించిన 46 మంది క్రీడాకారులకు వైఎస్సార్‌ క్రీడా పురస్కారాలను శనివారం అందజేశారు. నగరంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. జాతీయస్థాయి క్రీడల్లో మొదటి స్థానం పొందిన వారికి రూ.1.25లక్షలు, ద్వితీయ స్థానం సాధించిన వారికి రూ.75వేలు, మూడో స్థానం సాధించిన వారికి రూ.50వేల బహుమతితోపాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. మచిలీపట్నం, ఈడ్పుగల్లులో స్విమ్మింగ్‌పూల్‌, ఆత్కూరులో రూ.1.20 కోట్లతో మినీ స్టేడియం, విద్యాధరపురంలో రూ.6 కోట్ల మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మిస్తున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. క్రీడా ప్రాధికార సంస్థ సీఈవో ప్రసాద్‌, చీఫ్‌ కోచ్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

రైతులకు మెరుగైన సేవలందించాలి

విజయవాడ సిటీ : హార్టికల్చర్‌ అసిస్టెంట్లు గ్రామాల్లో రైతులకు సేవలందించాలని, మెరుగైన సేద్యపు పద్ధతులు వారికి తెలియజేయాలని కలెక్టర్‌ సూచించారు. హార్టికల్చర్‌ అసిస్టెంట్లుగా నియమించబడిన ఎనిమిది మందికి ఉద్యోగ నియమాక పత్రాలను ఆయన శనివారం అందజేశారు. జిల్లాలో లక్షా 3 వేల హెక్టార్లలో హార్టికల్చర్‌ సాగు చేస్తున్నారన్నారు. ఉద్యానవనశాఖ డెప్యూటీ డైరెక్టర్‌ రవికుమార్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ దయాకర్‌బాబు పాల్గొన్నారు. అలాగే వెల్పేర్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లుగా ఎంపికైన 21 మంది అభ్యర్థులకు కలెక్టర్‌ నియామకపత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్తగా ఉద్యోగాల్లో నియమితులైన వారు మెరుగైన సేవలందించి సచివాలయ వ్యవస్థకు మంచిపేరు తీసుకురావాలని హితవు పలికారు. కేటగిరి-1 వెల్ఫేర్‌, ఎడ్యుకేషన్‌ అసిసెంట్ల 22 పోస్టుల భర్తీకిగాను 21 మందిని ఎంపిక చేశామని, మరో పోస్టు స్పోర్ట్స్‌ కోటాలో భర్తీ చేయనున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. సాంఘిక సంక్షేమశాఖ డెప్యూటీ డైరెక్టర్‌ కె.సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T06:05:12+05:30 IST