వైఎస్సార్ నవోదయంతో పరిశ్రమలకు కొత్త ఊపిరి : కలెక్టర్
ABN , First Publish Date - 2020-06-30T10:35:32+05:30 IST
వైఎస్సార్ నవోదయం రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోస్తోందని కలెక్టర్ సి.హరికిరణ్ అన్నారు.
కడప(కలెక్టరేట్), జూన్29: వైఎస్సార్ నవోదయం రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోస్తోందని కలెక్టర్ సి.హరికిరణ్ అన్నారు. సోమవారం విజయవాడ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకొనేందుకు రీస్టార్ట్ ప్యాకేజీ రెండవ విడత రాయితీ బకాయిలను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ హరికిరణ్, జేసీ శివారెడ్డి పారిశ్రామిక వేత్త రాజోలి వీరారెడ్డి హాజరయ్యారు.
సీఎం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లాకు చెందిన 502 మంది ఎంఎస్ఎంఈ యూనిట్లకు రీస్టార్ట్ ప్యాకేజీ కింద రూ.28.83 కోట్ల మొత్తాన్ని మెగా చెక్కు రూపంలో లబ్ధిదారులకు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ 2014-15 నుంచి గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలతో కలుపుకొని రీస్టార్ట్ ప్యాకేజీద్వారా మొదటి విడతగా జిల్లాలో 256 యూనిట్లకు గానురూ.22.23 కోట్లను విడుదల చేశామన్నారు. రెండవ విడతలో జిల్లాలో 502ఎంఎస్ ఎంఈలకు రూ.28.83 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం చాంద్బాషా, డిక్కీ జిల్లా కో-ఆర్డినేటర్ శంకర్ పాల్గొన్నారు.