పాదయాత్రకు విరామం తీసుకోనున్న షర్మిల.. కారణం ఇదేనా?
ABN , First Publish Date - 2021-11-10T23:51:30+05:30 IST
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పాదయాత్రకు విరామం తీసుకోనున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. 21 రోజుల పాదయాత్రలో...
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పాదయాత్రకు విరామం తీసుకోనున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. 21 రోజుల పాదయాత్రలో వందల సమస్యలు తెలుసుకున్నామన్నారు. గతంలో ప్రతీ గింజ కొంటామని చెప్పి ఇప్పుడు వడ్లు కొనబోమని చెప్పడం మాట తప్పడం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణలో 91 శాతం మంది రైతులు అప్పుల పాలైనట్లు సర్వే చెబుతున్నాయన్నారు.
‘‘రైతులు పండించిన వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12 నుంచి 72గంటల పాటు హైదరాబాద్లో ‘రైతు వేదన’ దీక్ష చేయబోతున్నాం. రైతులకు మా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం చివరి గింజ వరకూ కొనుగోలు చేయాలి.’’ అని షర్మిల అన్నారు.
‘‘ప్రజాప్రస్థానం 21 రోజులుగా దిగ్విజయంగా సాగింది.ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజ్యాంగ విలువలను పాటిస్తూ..ఎన్నికల కమిషన్ నిబంధనలను గౌరవిస్తూ ఈరోజు నుంచి పాదయాత్ర తాత్కాలిక వాయిదా వేయడమైనది. కోడ్ ముగిసిన వెంటనే ప్రజాప్రస్థానం తిరిగి ప్రారంభమౌతుంది.’’ అని షర్మిల తెలిపారు.