ఏపీలో పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2022-01-03T19:20:42+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెడతారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల ఏమన్నారంటే..

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెడతారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై మీడియా అడిగిన ప్రశ్నకు షర్మిల చాలా వ్యూహాత్మకంగా సమాధానం ఇచ్చారు. రాజకీయ పార్టీ ఎప్పుడైనా పెట్టవచ్చు... పెట్టకూడదనే రూల్ ఏమీ లేదుకదా? అని వ్యాఖ్యనించారు. కొంత కాలంగా సోదరుడు జగన్ తీరుపై షర్మిల ఆగ్రహంగా ఉన్నారు. మొన్న పులివెందుల వెళ్లినప్పుడు కూడా జగన్, షర్మిల మధ్య వాగ్వాదం జరిగిందనే వార్త గుప్పుమంది. అంతేకాదు జగన్ ఏపీలో ఉండి ఇక్కడ తెలంగాణలో తనకు నష్టం కలిగిస్తున్నారని షర్మిల అభిప్రాయం పడుతున్నట్లు సమాచారం. వాటన్నింటికి తెరదించేలా ఏపీలో కూడా షర్మిల పార్టీ పెడతారంటూ ప్రచారం జరుగుతోంది.


ఇదే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు షర్మిల వ్యూహాత్మకంగా సమాధానం ఇచ్చారు. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చని అన్నారు. తామొక మార్గాన్ని ఎంచుకున్నామని, ఈనెల 19 లేదా 20 నుంచి పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. రైతు ఆవేదన యాత్రకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారని, కరోనా నిబంధనలు పాటిస్తామంటున్నా అనుమతి ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రం నిబంధనలు అడ్డురావా? అన్ని ప్రశ్నించారు. నిబంధనల వంకతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని షర్మిల మండిపడ్డారు.

Updated Date - 2022-01-03T19:20:42+05:30 IST