అసెంబ్లీలో సీఎం జగన్ కీలక ప్రకటన.. ‘సంగం’ బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు

ABN , First Publish Date - 2022-03-08T17:14:09+05:30 IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

అసెంబ్లీలో సీఎం జగన్ కీలక ప్రకటన.. ‘సంగం’ బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని సీఎం ప్రకటించారు. ఇప్పటికే 84 శాతానికి పైగా పనులు పూర్తయిన ఈ ప్రాజెక్ట్‌ను ఆరు వారాల్లోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ గురించి మాట్లాడుతూ జగన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 


మిత్రుడిని కోల్పోయా..!

గౌతమ్‌ అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. గౌతమ్‌ లేని లోటు పూడ్చలేనిది. గౌతమ్‌రెడ్డి నాకు చిన్నప్పట్నుంచి మంచి స్నేహితుడు. అలాంటి మిత్రుడిని కోల్పోవడం బాధాకరం. చాలా సందర్భాల్లో గౌతమ్‌రెడ్డి నాకు అండగా నిలబడ్డారు. ఆయన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారు. ఏపీకి కొత్త కంపెనీలు రావడంలో గౌతమ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. పారిశ్రామిక మంత్రిగా గౌతమ్‌రెడ్డి చాలా కృషి​ చేశారు. గౌతమ్‌రెడ్డి ఇవాళ మన మధ్య లేకపోయినా ఆయన కన్న కలలు నెరవేరుస్తాం. వెలిగొండ ప్రాజెక్ట్‌ ద్వారా ఉదయగిరికి తాగునీటిని అందిస్తాంఅని వైఎస్ జగన్ అసెంబ్లీ వేదికగా చెప్పుకొచ్చారు.


శాసన సభలో తీర్మానం..

కాగా.. మంగళవారం నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవ్వగానే.. బీఏసీలో తీసుకున్న నిర్ణయాల‌ను స్పీకర్ తమ్మినేని స‌భ‌లో ప్రవేశ‌పెట్టారు. అనంతరం ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన గౌత‌మ్ రెడ్డి మృతిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గౌత‌మ్ రెడ్డితో ఉన్న అనుబంధాల‌ను మంత్రులు అనిల్, పెద్దిరెడ్డి, సురేష్ ఇత‌ర ఎమ్మెల్యేలు సభకు వివరించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడాల్సి రావడం దురదృష్టకరమని కంటతడి పెట్టారు. జగనన్నకి నిజమైన సైనికుడు గౌతమ్‌రెడ్డి అని రోజా చెప్పారు. ఈ సంతాప తీర్మానం అనంతరం ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు గురువారానికి స్పీకర్ వాయిదా వేశారు.

Updated Date - 2022-03-08T17:14:09+05:30 IST