Roadshow ఆపి మరీ యువకుడి గోడు విన్న ముఖ్యమంత్రి
ABN , First Publish Date - 2022-06-19T22:11:20+05:30 IST
అగ్నిపథ్ పథకంపై ఆందోళన చేస్తున్న ఒక యువకుడు పంజాబ్ ముఖ్యమంత్రి... భగవంత్ మాన్
సంగ్రూర్: అగ్నిపథ్ పథకం (Aganipath Schmeme)పై ఆందోళన చేస్తున్న ఒక యువకుడు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) కారును (SUV) ఆపి మరీ తన గోడును వెళ్లబోసుకున్నాడు. ముఖ్యమంత్రి సైతం ఓపిగ్గా అతని ఆవేదనను విన్నారు. పంజాబ్లోని సంగ్రూర్ ఉపఎన్నిక కోసం సీఎం ఆదివారంనాడు రోడ్షోలో పాల్గొన్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. యువకుడితో మాన్ సంభాషిస్తున్న వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) షేర్ చేసింది.
సీఎం రోడ్షో జరుపుతుండగా యువకుడు చేతులు ఊపడంతో మాన్ తన SUVని ఆపారు. వెంటనే ఆ యువకుడు ఆయనతో మాట్లాడాలంటూ చేయి ముందుకు చాపాడు. సీఎం అతని చేతిని అందుకుంటూ ఓపిగ్గా అతనితో సంభాషించారు. ''అగ్నిపథ్ అమలుకు ముందే నేతలంతా సమవేశమై దానిపై చర్చించాలి'' అని ఆ యువకుడు సీఎంకు విన్నవించాడు. దీనికి ముఖ్యమంత్రి సమాధానమిస్తూ, ఎంపీలు అగ్నిపథ్పై చర్చించేందుకు సమావేశమైతే తాను వ్యక్తిగతంగా అక్కడకు వెళ్తానని ఆ యువకుడికి భరోసా ఇచ్చారు. "భగవంత్ మాన్ను పంజాబ్ ఎందుకు ప్రేమిస్తుందనడానికి కారణం ఇదే'' అంటూ ఆప్ అఫీషియర్ ట్విట్టర్ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.
కాగా, ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భగవంత్ మాన్ ఇటీవల పోటీ చేసి గెలుపొందారు. అనంతరం పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎంపీ పదవికి వెంటనే రాజీనామా చేశారు. దీంతో సంగ్రూర్ ఉప ఎన్నిక అనివార్యమైంది.