వ్యవసాయంవైపు యువతను ప్రోత్సహించాలి: ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2021-01-20T00:42:27+05:30 IST

వ్యవసాయరంగంపై యువతలో ఆసక్తి తగ్గిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి.. సామాజిక-ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు, వ్యవసాయ ఉత్పాదక ధరల్లో పెరుగుదల, పెట్టుబడికి తగిన ఆదాయం లేకపోవడం తదితర కారణాల వల్లే యువత ఈ రంగానికి దూరమవుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పులు తీసుకొచ్చి..

వ్యవసాయంవైపు యువతను ప్రోత్సహించాలి: ఉపరాష్ట్రపతి

హైదరాబాద్: భారతదేశం నుంచి వ్యవసాయ మేధోవలసను తగ్గించడం ద్వారా యువతను వ్యవసాయంవైపు మళ్లించి.. ఓ గౌరవప్రదమైన వృత్తిగా వ్యవసాయాన్ని స్వీకరించేలా ప్రోత్సహించాల్సిన తక్షణావసరం ఉందని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సాంకేతికత ఆధారిత వ్యవసాయ పద్ధతులను అనుసరించే వ్యవసాయదారుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని ఆయన అన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పౌష్టికాహార భద్రత, సుస్థిర ఆహార వ్యవస్థ’ ఇతివృత్తంతో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ, నీతి ఆయోగ్, ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘ఇండియన్ అగ్రికల్చర్ టువర్డ్స్ 2030’ అనే జాతీయ చర్చను మంగళవారం, హైదరాబాద్ నుంచి అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.  అనంతరం, ఆయన మాట్లాడుతూ భారత పర్యావరణ, ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి, నాగరికతకు వ్యవసాయమే మూలాధారమని కొనియాడారు.


వ్యవసాయరంగంపై యువతలో ఆసక్తి తగ్గిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి.. సామాజిక-ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు, వ్యవసాయ ఉత్పాదక ధరల్లో పెరుగుదల, పెట్టుబడికి తగిన ఆదాయం లేకపోవడం తదితర కారణాల వల్లే యువత ఈ రంగానికి దూరమవుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పులు తీసుకొచ్చి.. పరిశోధనల ఫలం క్షేత్రస్థాయికి చేరేలా చొరవతీసుకోవడం, వ్యవసాయం-పరిశ్రమ మధ్య అనుసంధానతను పెంచడం ద్వారా వ్యవసాయదారులను వ్యవసాయ పారిశ్రామిక వేత్తలుగా మార్చే దిశగా మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కరోనా మహమ్మారి వంటి విపత్కర సమయంలోనూ 2019-20 సంవత్సరానికి గానూ రికార్డు స్థాయిలో ఆహారోత్పత్తి పెంచిన విషయాన్ని గుర్తుచేస్తూ భారతదేశ రైతులను అభినందించారు. ఈ సందర్భంగా భారతదశ వ్యవసాయ రంగం ఎదుర్కుంటున్న నాలుగు సవాళ్లను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.


వ్యవసాయంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. మహిళా రైతుల సంక్షేమంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయాధారిత రంగాలైన పౌల్ట్రీ, పాడి, చేపల పెంపకం, ఉద్యాన పంటలు తదితర వ్యవస్థలను ప్రోత్సహిస్తూ.. ఆహార భద్రత వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా జరుగుతున్న ప్రయోగాలు, పరిశోధనల ఫలితాలను రైతులకు అందజేయడంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు కృషిచేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు. రైతన్నల సంక్షేమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ‘టీమ్ ఇండియా’గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంటు, రాజకీయ పార్టీలు, నాయకులు, విధాన నిర్ణేతలు, మీడియా.. రైతుల గొంతుకను వినిపించాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

Updated Date - 2021-01-20T00:42:27+05:30 IST